హైదరాబాద్ : అడవుల నిర్వహణ, అభివృద్ధిలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు తెలంగాణ అటవీ, అభివృద్ధి సంస్థకు (TSFDC) ఫారెస్ట్ స్టీవార్డ్ కౌన్సిల్(FSC జర్మనీ) సర్టిఫికేట్ దక్కింది. సేంద్రీయ పద్ధతిలో యుకలిప్టస్, వెదురు, టేకు, జీడి మామిడి లాంటి అటవీ ఉత్పత్తు (ముడిసరకు) ల నుంచి తయారు అయ్యే వస్తువులకు ఐదు సంవత్సరాల పాటు తన లోగోను ఉపయోగించుకునేందుకు ఎఫ్ఎస్సీ అనుమతినిచ్చింది.
ఈ సందర్భంగా అరణ్య భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అటవి, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అటవీ అధికారులు, సిబ్బందిని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 75 వేల ఎకరాల్లో యుకలిప్టస్, వెదురు, టేకు, జీడి మామిడి చెట్లను అత్యున్నత ప్రమాణాలతో సాగు చేస్తూ పంట పండిస్తున్నామని అధికారులు వివరించారు. కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి అటవీ డివిజిన్లలో సుమారు 45 వేల ఎకరాల్లో సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేస్తున్న పంటకు ఈ గుర్తింపు దక్కిందని వెల్లడించారు. దీని వల్ల అంతర్జాతీయంగా తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్థ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని అన్నారు.
ఐకియా లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్లకు ఎఫ్ఎస్సీ దృవీకరించిన కలపను విక్రయించే అవకాశం దక్కిందని పేర్కొన్నారు. 5 సంవత్సరాలలో రూ. 10 కోట్ల అదనపు ప్రయోజనం కలగనుందని, కంపోజిట్ వుడ్ పేపర్, ప్యాకింగ్ పరిశ్రమల కోసం ప్రాసెస్ చేసిన ఉత్పత్తులకు అధిక ధర లభిస్తుందన్నారు. అటవీ ఉత్పత్తుల నుంచి తయారు చేసిన కాగితం, టెట్రా ప్యాక్, మిశ్రమ కలపకు ఎఫ్ఎస్సీ ఆమోదం లభించిందని చెప్పారు.
సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీఎం కేసీఆర్ దిశానిర్ధేశంలో పచ్చదనం పెంపునకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇలాంటి గుర్తింపు రావడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, పీసీసీఎఫ్ ఆర్.యం. డొబ్రియల్, అటవీ శాఖ అడిషనల్ సెక్రటరీ యం. ప్రశాంతి, టీఎస్ఎఫ్డీసీ వైస్ చైర్మన్ ,ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, అదనపు పీసీసీఎఫ్ వినయ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.