హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : టీచర్పోస్టుల భర్తీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. డీఎస్సీ ద్వారా భర్తీచేసే పోస్టుల సంఖ్యను పెంచింది. మరో 5,973 టీచర్ పోస్టులను అదనంగా భర్తీచేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ సోమవారం పచ్చజెండా ఊపుతూ రెండు వేర్వేరు జీవోలను జారీచేసింది.
జీవో -27 ద్వారా 4,957 పోస్టుల భర్తీ, 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉద్యోగాల నియామకానికి జీవో -26ను ఆర్థికశాఖ జారీచేసింది. గతంలో 5,089 పోస్టుల భర్తీకి గత కేసీఆర్ సర్కారు నోటిఫికేషన్ను జారీచేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు పోటీపడేందుకు 1.77లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు.
రాష్ట్రంలోకొత్త ప్రభుత్వం కొలువుదీరటంతో డీఎస్సీపై దృష్టిపెట్టింది. మెగా డీఎస్సీని ప్రకటిస్తామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో ప్రకటించడంతో టీచర్ పోస్టులను పెంచింది. ఈ నేపథ్యంలోనే 5,973 టీచర్ పోస్టులకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా,ఆర్థికశాఖ గ్రీన్సిగ్నల్నిచ్చింది. దీంతో గతంలో నోటిఫికేషన్లో ప్రకటించినవి.. తాజాగా ఆర్థిక శాఖ ఆమోదించినవి కలుపుకొంటే మొత్తం పోస్టుల సంఖ్య 11,062కు చేరింది. గ్రూప్ – 1 తరహాలోనే పాత డీఎస్సీని రద్దుచేయన్నట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్
కొత్తగా డీఎస్సీ నోటిఫికేషన్ను రెండు మూడురోజుల్లో పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనున్నది. అయితే, ఈసారి టెట్ లేకుండానే డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేస్తారు. తాజా సమాచారం ప్రకారం ఈ పోస్టుల్ల్లో 6,500కు పైగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులున్నాయి. స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులు 2,600, పండిట్ పోస్టులు 700, పీఈటీలు 190 పోస్టులున్నట్టు తెలిసింది.