హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రాన్ని రుణాల ఊబిలో దింపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అప్పుల బాట పట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో రూ.2 వేల కోట్ల రుణాన్ని సమీకరించింది. ఇందులో 7 సంవత్సరాల కాలపరిమితితో 7.74% వార్షిక వడ్డీకి రూ.750 కోట్లు, 11 ఏండ్ల్ల కాలపరిమితితో 7.84% వడ్డీకి రూ.500 కోట్లు, 21 ఏండ్ల కాలపరిమితితో 7.91% వడ్డీకి రూ.750 కోట్లు సేకరించింది.
ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి రేవంత్రెడ్డి సర్కార్ అప్పులు తీసుకోవడం ఇది నాలుగోసారి. దీనితో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన మొత్తం అప్పు రూ.12,900 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆర్బీఐ నుంచి మొత్తం రూ.18,900 కోట్ల రుణాలు సమీకరించనున్నట్టు రాష్ట్ర బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో భాగంగా ఏప్రిల్ నెలలోనే రెండు విడతలుగా రూ.6,900 కోట్లు, ఆ తర్వాత ఈ నెల 5న మరో రూ.4 వేల కోట్లు తెచ్చింది.
గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అంచనాలకు మించి భారీగా అప్పులు తెచ్చింది. 2025-26లో బహిరంగ మార్కెట్ నుంచి మొత్తంగా రూ.54,009 కోట్ల రుణాలు తెస్తామని బడ్జెట్లో ప్రకటించినప్పటికీ ఏకంగా రూ.85,840 కోట్ల అప్పులు తెచ్చింది. ఇది బడ్జెట్లో ప్రతిపాదించిన మొత్తం కంటే 44% అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.80 వేల కోట్ల రుణాలు సమీకరించనున్నట్టు బడ్జెట్లో ప్రతిపాదించిన రేవంత్రెడ్డి సర్కార్.. ఈసారి కూడా అంచనాలకు మించి అప్పులు తెచ్చే అవకాశం ఉన్నదని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
