హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): గ్రూప్-4లో మరో 141 ఉద్యోగాలను కలుపుతూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకొన్నది. కొత్త ఉద్యోగాలకు శుక్రవారమే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వగా, శనివారమే టీఎస్పీఎస్సీ ప్రకటన జారీ చేసింది. రాష్ట్రంలో 25 విభాగాల్లో 8,039 గ్రూప్-4 ఉద్యోగాలను భర్తీకి నిరుడు డిసెంబర్ 1న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్కు అనుబంధంగా బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీలో కొత్తగా 141 ఉద్యోగాల భర్తీకి శనివారం ప్రకటన జారీ చేసింది.
బాయ్స్ ఇనిస్టిట్యూట్లో 86 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వీటికి పురుషులు, మహిళలు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. గర్ల్స్ ఇనిస్టిట్యూట్లో 55 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉండగా, వీటికి మహిళలు మాత్రమే అర్హులు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హులని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం https://www.tspsc.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని సూచించారు.
కొత్తగా చేర్చిన ఉద్యోగాలను కలిపితే గ్రూప్-4లో పోస్టుల సంఖ్య 8,180కి పెరిగింది. అయితే, దరఖాస్తులకు సోమవారంతో గడువు ముగియనున్నది. నిరుడు డిసెంబర్ 30 నుంచి జనవరి 30వ తేదీ వరకు దరఖాస్తులకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. శనివారం వరకు గ్రూప్-4 ఉద్యోగాలకు 7,41,159 మంది దరఖాస్తు చేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, కొత్తగా జత చేసిన ఉద్యోగాల భర్తీలో వారిని పరిగణనలోకి తీసుకుంటామని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు.