హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): పంట రుణాల మాఫీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నప్పటికీ, వాటిని పరిష్కరిస్తూ అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. రుణమాఫీ కోసం బుధవారం మరో రూ.1,000 కోట్లు విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు 21.35 లక్షల రైతులకు చెందిన రూ.11,812 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. ఈ మేరకు ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 29.61 లక్షల రైతులకు సంబంధించిన రూ.19 వేల కోట్ల రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆగస్టు 3న ఆ ప్రక్రియను ప్రారంభించింది.
స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న ఒక్కరోజే రూ.5,809 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో ఆ ఒక్కరోజే రూ.లక్ష లోపు రుణం ఉన్న 9 లక్షల మంది రైతులు రుణవిముక్తులయ్యారు. ఒక్కొక్క రైతుకు గరిష్ఠంగా రూ.లక్ష చొప్పున మాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నది. ఇప్పటివరకు రూ.1.20 లక్షల వరకు రుణాలు పొందిన రైతులు రుణమాఫీ పథకంలో కవర్ అయినట్టు సమాచారం. మిగిలినవారి రుణాలను కూడా మాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. బ్యాంకు ఖాతాల సమస్యలతో తిరస్కరణకు గురైనవాటిని కూడా తిరిగి చెల్లించేలా చర్యలు చేపట్టింది. బ్యాంకర్లతో మాట్లాడిన వ్యవసాయ శాఖ అధికారులు ఆయా సమస్యలను పరిష్కరిస్తున్నారు. త్వరలోనే వీరికి కూడా రుణమాఫీ సొమ్ము జమ కానున్నది.