యాదాద్రి, డిసెంబర్ 23 : యాదాద్రిలో లక్ష్మీనరసింహ స్వామి అధ్యయనోత్సవాలను జనవరి 13 నుంచి 18వ తేదీ వరకు ఆరు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో ఎన్ గీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రోజూ ఉదయం, సాయంత్రం అలంకార సేవలు, అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి భక్తులు నిర్వహించే సుదర్శన నారసింహ హోమం, కల్యాణం, బ్రహ్మోత్సవాలు, శాశ్వత కల్యాణం, లక్షపుష్పార్చన నిలిపివేయనున్నట్టు తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం, పాతగుట్ట ఆలయంలో జనవరి 13న వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి వేడుకలు నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో గీత తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చేనెల 13న ప్రధానాలయంతోపాటు పాతగుట్ట ఆలయాన్ని తెల్లవారుజామున 3.30 గంటలకు తెరువనున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఉదయం 6.49 గంటలకు బాలాలయంలో స్వామివారు తూర్పు ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారని, పాతగుట్ట లక్ష్మీనారసింహుడు ఉత్తర రాజగోపురం ద్వారా ఉదయం 6.49 గంటలకు వైకుంఠనాథుడిగా దర్శనం ఇవ్వనున్నారని తెలిపారు.