హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పాటైన తర్వాత మన ఆలయాలకు మంచి రోజులు వచ్చాయి. ఉమ్మడి పాలనలో తీవ్ర నిరాదరణకు గురైన తెలంగాణలోని దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో మహర్దశ వచ్చింది. ఆలయాల అభివృద్ధి, ధూపదీప నైవేద్యం వంటి వినూత్న పథకాలతో దేవాదాయ-ధర్మాదాయ శాఖలో నవశకం ఆరంభమైంది. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించేనాటికి, అంటే 2014-15 వరకు దేవాదాయశాఖ వ్యయం ఏటా సగటున రూ.215.44 కోట్లు కాగా.. 2021-22 నాటికి ఇది రూ.800 కోట్లకు పెరిగింది. యాదగిరిగుట్ట, వేములవాడకు ఖర్చు చేస్తున్న నిధులు ఇందుకు అదనం. అన్నీ కలిపి ఆలయాలపై ప్రభుత్వం చేస్తున్న వ్యయం ఏటా రూ.2,174.02 కోట్లకు చేరుకొన్నది. అంటే, 2014-15తో పోల్చుకుంటే నేడు ఆలయాలపై చేస్తున్న వ్యయం పదింతలు పెరిగింది.
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ
స్వతహాగా ఆధ్యాత్మికపరుడైన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర దేవాదాయ శాఖపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఇందులోభాగంగా రాష్ట్రంలోని ప్రముఖ క్షేత్రం యాదగిరిగుట్టను రూ.1,200 కోట్లతో పునరుద్ధరణ చేశారు. వేములవాడ ఆలయాన్ని రూ.60 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. వీటితోపాటు ధర్మపురి, కాళేశ్వరం తదితర ప్రముఖ ఆలయాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి పనులు చేపట్టారు. భక్తులకు అన్ని ఆలయాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రతి ఆలయంలో దీపం వెలగాలనే సంకల్పంతో ధూప దీప నైవేద్యం పథకాన్ని విస్తరించారు. కామన్ గుడ్ ఫండ్ను భారీగా పెంచడమే కాకుండా దాతల ద్వారా ఆలయాలకు నిధులు సమకూరే విధంగా చర్యలు తీసుకొన్నారు. భక్తులకు భగవంతుడి దర్శనం సులభంగా అయ్యేలా సేవలను ఆన్లైన్ ద్వారా అందిస్తున్నారు. ఆలయ భూముల పరిరక్షణలో భాగంగా అన్యాక్రాంతమైన దాదాపు 5,050 ఎకరాల భూములను స్వాధీనం చేసుకొన్నారు. అంతేకాదు, పరాధీనమైన భూములను తిరిగి రాబట్టేందుకు ప్రత్యేక డ్రైవ్తోపాటు వాటిని గెజిట్లో నమోదుచేసే ప్రక్రియను చేపట్టారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ధూప దీప నైవేద్యం పథకం కింద ఒక్కో ఆలయానికి రూ.2 వేలు, అర్చకుడికి రూ.4 వేలు ఇస్తున్నారు. అంతేకాదు, ఆలయ పూజారులు, ఉద్యోగులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తున్నారు.
ఆలయాలకు పెరుగుతున్న భక్తులు
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో ఆలయాలకు భక్తుల రద్దీ పెరుగుతున్నది. యాదగిరిగుట్ట ఆలయానికి రోజుకి సగటున 35 వేల నుంచి 40 వేల మంది భక్తులు రావడమే ఇందుకు నిదర్శనం. వేములవాడ, భద్రాచలం, ధర్మపురి, కాళేశ్వరం క్షేత్రాలకు మన రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. ముఖ్యంగా సెలవు రోజుల్లో రాష్ట్రంలోని ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రధాన ఆలయాల వద్ద సౌకర్యాలు మెరుగుపరచడంతో ఎక్కువమంది విహారయాత్రలకు బదులు ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నారు.
కొన్ని ముఖ్య ఆలయాల్లో వ్యయం వివరాలు