యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీపాంచరాత్రాగమశాస్త్రం ప్రకారం కొనసాగుతున్నాయి. 6వ రోజు సోమవారం స్వామివారు ఉదయం గోవర్ధనగిరిధారిగా.. రాత్రి సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలో నరసింహస్వామి వారు మాడ వీధుల్లో విహరించారు.
సంగీత, ధార్మిక మహాసభల్లో ఆలయ తిరుమాడ వీధుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలో ఆలయ అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ఈవో భవానీశంకర్, కలెక్టర్ హనుమంతరావు, డీఈవో దోర్బల భాస్కర్ శర్మ, ప్రధానార్చకులు కే వేంకటాచార్యులు, భట్టర్ సురేంద్రాచార్యులు పాల్గొన్నారు.