BRS | హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. బీఆర్ఎస్ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో విస్తృతంగా చర్చించి, వారి అభిప్రాయాలకు అనుగుణంగా బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామ నాగేశ్వర్రావుకు మరోసారి అవకాశం కల్పించారు. మహబూబాబాద్ (ఎస్టీ రిజర్వ్) స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితకు మరోసారి అవకాశం దక్కింది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రపోషించి, ఢిల్లీలో తెలంగాణవాణిని బలంగా వినిపించిన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి, మరో ఉద్యమకారుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి (ఎస్సీ రిజర్వ్ స్థానం) నుంచి బరిలో దిగనున్నారు. అన్నిస్థాయిల పార్టీ శ్రేణుల అభిమానానాన్ని గెలుచుకున్న ఈ నలుగురు అభ్యర్థులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల అనంతరం తెలంగాణ భవన్ కేంద్రంగా రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పార్టీ ముఖ్యనేతలు, అన్నిస్థాయిల ప్రజాప్రతినిధులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు టీ హరీశ్రావు, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, కడియం శ్రీహరి, జగదీశ్రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ మునుపెన్నడూ లేనివిధంగా అన్ని స్థాయిల్లోని పార్టీ ప్రతినిధుల అభిప్రాయాలను స్వీకరించింది. ఆ అభిప్రాయాలను పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లింది. పార్టీ అధినేత కేసీఆర్ వార్డు/డివిజన్, మండల, జిల్లా స్థాయి నేతలతో సంప్రదింపులు జరిపారు. తాగాజా పార్టీ అధినేత కేసీఆర్ ఈ నాలుగు లోక్సభస్థానాల ముఖ్యనేతలతో మరోసారి ఇదే తెలంగాణ భవన్ కేంద్రంగా సమాలోచనలు చేశారు. అన్ని స్థాయిల పార్టీ, ప్రజాప్రతినిధుల ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ప్రకటించారు.