(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 21, (నమస్తే తెలంగాణ): అతడి పేరు బ్రిజ్భూషణ్ శరణ్సింగ్. యూపీకి చెందిన బీజేపీ ఎంపీ. తాను ఒకరిని హత్య చేసినట్టు ఇటీవల ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా అంగీకరించాడు. చిన్న చిన్న నేరాలకే సామాన్యుల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చేసే యూపీలోని డబుల్ ఇంజిన్ సర్కారు.. తాను మర్డర్ చేసినట్టు స్వయంగా బీజేపీ ఎంపీ వెల్లడించినా ఇప్పటివరకూ ఎలాంటి కేసూ నమోదు చేయలేదు. ఎంపీ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘మీ ఎంపీని అరెస్టు చేయరా యోగీజీ?’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు యూపీ సీఎంను నిలదీస్తున్నారు. సామాన్యులకు ఒక న్యాయం.. సొంత పార్టీ ఎంపీకి మరో న్యాయం ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు తప్పు చేయకపోయినా.. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర సంస్థలను వారిపైకి ఉసిగొల్పుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పార్టీ ఎంపీ నేరం చేసినట్టు బహిరంగంగా చెప్తున్నా విననట్టు నటిస్తున్నది.
కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ డైరెక్షన్లోనే పనిచేస్తాయని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అంగీకరించారు. మంగళవారం ఒక టీవీ చానెల్లో జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘చట్టం తన పని తాను చేస్తుంది.. దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తాయి’ అంటూ ఒకవైపు బీజేపీ అగ్రనేతలు ఊదరగొడుతుండగా.. మరోవైపు విశ్వేశ్వర్రెడ్డి మాత్రం దర్యాప్తు సంస్థలపై తమ పార్టీ ప్రభావం తప్పకుండా ఉంటుందని కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం ఈ అంశంపై నెటిజన్లు బీజేపీ నేతలను ట్రోల్ చేస్తున్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థల విశ్వసనీయతను బయటపెడుతూ బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర ప్రభుత్వం, బీజేపే నేతలు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నాయకుడు వై సతీశ్రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ ఆయన చెప్పింది నిజమే అయితే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరును ప్రస్తావిస్తూ విశ్వేశ్వర్రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియో క్లిపింగ్ను జత చేస్తూ ఆయన ట్వీట్ చేసారు.