Annaram Barrage | జయశంకర్ భూపాలపల్లి. ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ)/కాళేశ్వరం: కాళ్వేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బరాజ్లో అధికారులు నీటిని పూర్తిగా వదిలేశారు. మొత్తం 2.5 టీఎంసీల నీటిని కిందికి వదిలారు. ఈ బరాజ్లోని 28, 38 ఔట్లెట్లలో ఏర్పడిన సీపేజ్లకు ఆప్కాన్స్ సంస్థ ఇప్పటికే కెమికల్ గ్రౌటింగ్ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మరోచోట చిన్న చిన్న సీపేజ్లు కనిపిస్తున్నాయి. దీంతో సీపేజ్లకు పూర్తిస్థాయి ట్రీట్మెంట్ చేయడంతోపాటు బరాజ్లో లోపాలను కనుగొనేందుకు ప్రభుత్వం పార్సన్ సంస్థకు ఇన్వెస్టిగేషన్ బాధ్యతలను అప్పగించింది.
అన్నారం బరాజ్లో నీరు ఉండటం, మేడిగడ్డ బరాజ్లో టెస్టింగ్ పనులు నెలల తరబడి కొనసాగుతుండటంతో విచారణలో జాప్యం జరుగుతున్నది. అధికారులు రెండ్రోజుల క్రితం అన్నారం నుంచి నీటి విడుదల ప్రారంభించడంతో సోమవారానికి బ్యారేజీ ఖాళీ అయింది. దీంతో అక్కడ టెస్టింగ్కు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నిపుణుల బృందం మంగళవారం అన్నారం, మేడిగడ్డ బరాజ్లను పరిశీలించనున్నది.
మేడిగడ్డ బరాజ్ ఏడో బ్లాక్లోని 20వ పియర్ కుంగుబాటుపై విచారణ నత్తనడకన సాగుతున్నది. సీరియస్గా పనులు చేపట్టి కుంగుబాటుకు కారణాలను తెలుసుకునే ప్రక్రియ ఇంతవరకు జరగలేదు. మేడిగడ్డ బరాజ్పై కమిటీ ఏర్పాటు చేస్తామని, ఎన్డీఎస్ఏతో విచారణ జరిపిస్తామని ప్రభుత్వం రోజుకో మాట చెప్తూ కాలయాపన చేస్తున్నది.