జయశంకర్ భూపాలపల్లి (నమస్తే తెలంగాణ)/కాళేశ్వరం, జనవరి 22: జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం బరాజ్లో ఏర్పడిన చిన్న చిన్న సీపేజ్లకు నిర్మాణ సంస్థ ఆప్కాన్స్ ట్రీట్మెంట్ పూర్తి చేసింది. పది రోజులుగా సీపేజ్లకు కెమికల్ గ్రౌటింగ్ కొనసాగించిన నిపుణులు సోమవారం ప్రక్రియను పూర్తి చేశారు. బరాజ్లోని 38, 28తోపాటు 35వ ఔట్లెట్స్లో కనిపించిన సీపేజ్లకు పాలి యూరిత్రిన్ కెమికల్తో గ్రౌటింగ్ చేశారు. ఆప్కాన్స్ నిపుణులు 15 రోజులపాటు అబ్జర్వేషన్లో ఉంచనున్నారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ సంస్థ పార్సన్ పరిశీలన జరిపి తుది నిర్ణయం తీసుకుంటుంది. అన్నారం (సరస్వతి)బరాజ్లో అక్టోబర్లో భారీ వర్షాలతో 38, 28 ఔట్లెట్స్ వద్ద చిన్న చిన్న సీపేజ్లు ఏర్పడ్డాయి.
అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు స్టోన్, మెటల్, ఇసుకతో తాత్కాలిక ట్రీట్మెంట్ చేసి లీకేజీని అరికట్టారు. నవంబర్ 2న సీడబ్ల్యూసీ బృందం అన్నారం బరాజ్ను సందర్శించి సీపేజ్లను పరిశీలించింది. ఇటీవల రాష్ట్ర మంత్రుల బృందం సైతం బరాజ్ను పరిశీలించి సీపేజ్లతో ప్రమాదమేమీ లేదని తేల్చి గ్రౌటింగ్ చేయించాలని సూచించింది. నిర్మాణ సంస్థ ఆప్కాన్స్ ఈ నెల 13న ట్రీట్మెంట్ ప్రారంభించింది. హిమాచల్ప్రదేశ్ నుంచి పాలీ యూరిత్రిన్ కెమికల్ను తెప్పించి 28, 38 ఔట్లెట్స్ వద్ద గ్రౌటింగ్ చేశారు. 35వ ఔట్లెట్ వద్ద చిన్న సీపేజ్ను కెమికల్తో నిరోధించారు. బరాజ్లోని నీటిని బయటికి పంపి ఏజెన్సీ సంస్థ పార్సన్తో ఇన్వెస్టిగేషన్ పనులు ప్రారంభిస్తారు. బరాజ్లో ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా.. లోపాలుంటే చేయాల్సిన పనుల గురించి ఇన్వెస్టిగేషన్ చేసి తుది నిర్ణయం తీసుకుంటారు. అనంతరం బరాజ్ను వినియోగంలోకి తీసుకొస్తారు.