గణపురం, ఏప్రిల్ 22: అధిక దిగుబడి వస్తుందని ఆశపడ్డ అన్నదాతలను ‘అంకుర్ సీడ్స్’ ప్రతినిధులు నకిలీ విత్తనాలను అంటగట్టి నట్టేట ముంచారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. అంకుర్ సీడ్స్కు చెందిన కొందరు దళారులు మండల కేంద్రంలోని పలువురు రైతులను కలిసి.. 130 రోజుల పంటకాలం, మంచి దిగుబడి వచ్చే సీడ్ను సాగుచేయాలని, ధాన్యాన్ని అత్యధిక ధరకు తామే కొనుగోలు చేస్తామని నమ్మించారు. వారి మాయమాటలు నమ్మిన 23 మంది రైతులు.. అంకుర్ సీడ్స్ కొని 86 ఎకరాల్లో వరిపంట సాగుచేశారు. అయితే.. మొక్క పెరగకపోగా 60 రోజులకు రావాల్సిన పొట్టదశ 35 రోజులకే వచ్చింది. 60 రోజుల్లోనే పంటకాలం పూర్తికాగా.. గొలుసు పెరగకపోవడంతో ఆశించిన మేర దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించలేదు. ఇదే విషయమై కంపెనీ ప్రతినిధులకు సమాచారం అందించామని, అప్పటి నుంచి తమ ఫోన్లు ఎత్తకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రైతులు దండు రాములు, దయ్యాల భద్రయ్య, మల్లయ్య, వడ్లకొండ దుర్వాసులు, వడ్లకొండ తిరుపతి, మామిండ్ల సారంగపాణి, పొట్లూరి సురేశ్, రవికుమార్ కలిసి సోమవారం స్థానిక ఎస్సై మచ్చ సాంబమూర్తికి విషయం తెలియజేశారు. తమవెంట తీసుకెళ్లిన వరి కంకులను చూపించారు. వెంటనే స్పందించిన ఎస్సై.. కంపెనీ ప్రతినిధులకు ఫోన్ చేసి రెండు మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.