Palle Pragathi | పల్లె మనసు పట్నం సొగసుతో తెలంగాణ గ్రామాలన్నీ మురిసిపోతున్నాయి. కనుచూపు మేర పచ్చదనం, పంటచేలకు సరిపడా సాగునీరు, ఇంటింటికీ నల్లానీరు, అందరికీ విద్యావకాశం, చక్కని రహదారులు, ప్రశాంతతకు మారుపేరుగా మారుమూల పల్లెసీమలన్నీ నేడు కళకళలాడుతున్నాయి. స్వచ్ఛభారత్కు మచ్చుతునకగా, గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యానికి అసలైన నమూనాగా తెలంగాణ పల్లెలు నిలుస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ అందిపుచ్చుకుని ఆదర్శంగా నిలుస్తున్న పల్లెలకు తెలంగాణలో కొదవే లేదు. కేంద్రం ప్రకటించిన అవార్డులే ఇందుకు నిదర్శనం. అలాంటి ఓ అందమైన పల్లె.. పదిలంగా అల్లుకున్న పొదరిల్లు లాంటి ఓ పల్లెను మీకు పరిచయం చేస్తున్నది నమస్తే తెలంగాణ.. స్వరాష్ట్రంలో పల్లెప్రగతి ఎలా సాకారమైందో తెలుసుకోండి.
ములుగు రూరల్, మే 24: ములుగు జిల్లాలోని మారుమూల గ్రామం అంకన్నగూడెం అభివృద్ధిలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలో మొత్తం 440 మంది జనాభా, 110 కుటుంబాలు ఉన్నాయి. అభివృద్ధిని చూడని ఊరుగా ఆంధ్ర పాలనలో అవస్థలు పడిన ఈ గ్రామం నేడు అన్నింటా దూసుకెళ్తున్నది. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం అధిక నిధులు వెచ్చించి అద్భుతంగా తీర్చిదిద్దింది. జనాభాకు అనుగుణంగా 15వ ఆర్థిక సంఘ ప్రతిపాదనల ప్రకారం నెలకు రూ.56 వేలు అందించటంతో పాటు గ్రామంలో రూ.70 లక్షలతో దుబ్బ రోడ్లను సీసీ రోడ్లుగా మార్చింది. రూ.10 లక్షలతో శ్మశాన వాటిక నిర్మాణం, క్రీడా మైదానం, రూ.4 లక్షలతో పల్లె ప్రకృతి వనం నిర్మాణం చేపట్టింది. నూతన గ్రామ పంచాయతీని మంజూరు చేసి రూ.16 లక్షలతో నిర్మించగా ప్రస్తుతం పనులు పూర్తి దశకు వచ్చాయి. జీపీకి రూ.10 లక్షతో ట్రాక్టర్, ట్యాంకర్ను సైతం ప్రభుత్వం సమకూర్చింది.
గ్రామ పంచాయతీ వ్యవస్థ మొదలైనప్పటి నుంచి కాలం ఏదైనా సమీపంలోని బొగ్గులవాగు నీరే గ్రామస్థులకు దిక్కయ్యేది. వేసవి వస్తే వాగులో నీరు ఎండిపోవడంతో చెలిమెలు తోడుకుని నీటిని వడపోసుకుని దాహం తీర్చుకునేవారు. గుక్కెడు నీటి కోసం గ్రామస్థుల వెతలు చెప్పనలవి కాకుండా ఉండేవి. చెలిమెలో ఊరే నీటి కోసం మండుటెండలో గంటల తరబడి గిరిజన మహిళలు వేచి చూసేవారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత వారి వెతలు తీరాయి. తాగునీటి బావి ద్వారా గ్రామం మొత్తానికి నీరు అందించేందుకు ప్రభుత్వం రూ.8 లక్షలతో పైప్లైన్ వేయించి నల్లాలు ఏర్పాటు చేసింది. ‘మిషన్ భగీరథ’ పథకం తర్వాత గ్రామంలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలన్న లక్ష్యంతో 2019లో పైలట్ ప్రాజెక్టుగా ఈ గ్రామానికి ఎంపిక చేసిన ప్రభుత్వం ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేసింది.అంతేకాకుండా నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా రూ.15 లక్షల నిధులతో గ్రామంలో వాటర్ ట్యాంకు నిర్మాణాన్ని చేపట్టింది.
మరుగుదొడ్ల నిర్మాణం ఆడబిడ్డకు గౌరవమని, బహిరంగ మలమూత్ర విసర్జనకు స్వస్తి చెప్పాలన్న ప్రభుత్వ పిలుపుతో గ్రామస్థులు ముందుకు వచ్చి 2017లో మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. 100కు 100 శాతం మరుగుదొడ్లు నిర్మించుకున్న గ్రామంగా జిల్లాలోని మిగతా గ్రామాలకు అంకన్నగూడెం ఆదర్శంగా నిలిచింది.
2014కు ముందు సర్వాపురం-జగ్గన్నగూడెం గ్రామాల మధ్యలో ఉన్న బొగ్గులవాగు అంకన్నగూడెంతో పాటు జగ్గన్నగూడెం గ్రామాలకు వానకాలంలో సమస్యగా మారేది. లోలెవల్ వంతెన ఉన్నప్పటికీ వర్షాకాలంలో పూర్తిగా నీటమునిగేది. దీంతో వర్షాకాలం పూర్తయ్యే వరకు నిత్యావసర వస్తువులు, ఇతర అవసరాలకు రెండు గ్రామాల ప్రజలు నరకం అనుభవించేవారు. అధికారులు పడవల సాయంతో సరుకులు సరఫరా చేయాల్సి వచ్చేది. అప్పట్లో ఈ వాగులో పడి ఇద్దరు అక్కాచెల్లెళ్లు మరణించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2015లో రూ.7 కోట్లతో ప్రభుత్వం బొగ్గులవాగుపై హైలెవల్ వంతెన నిర్మాణం చేపట్టింది. దీంతో ఇరు గ్రామాల ప్రజల ఇబ్బందులు మాయమయ్యాయి. వర్షాకాలంలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా రవాణా కొనసాగుతున్నది.
ప్రభుత్వం ప్రవేశపెట్టిప ‘రైతుబంధు’ వంటి పథకాలు అంకన్నగూడెం రైతుల ముఖచిత్రాన్ని మార్చాయి. గ్రామంలోని దాదాపు 80 మంది రైతులకు రెండు పంటలకు రైతుబంధు పైసలు జమవుతున్నాయి. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో 2017-18లో పీఎంకేసీఐ పథకం కింద 25 మంది రైతులకు 50 శాతం సబ్సిడీతో మోటర్లు, 20మందికి పైపులు అందించారు. అదే ఏడాది గ్రామానికి చెందిన కృష్ణ అనే రైతుకు రాష్ట్రప్రభుత్వం 50 శాతం శాతం సబ్సిడీతో రోటవేటర్, కంకి పట్టే మిషన్ను అందించింది. 2018లో 50 శాతం సబ్సిడీపై పరదాలు, జాతీయ ఆహార భద్రత పథకం కింద 50 మంది రైతులకు ఎకరాకు 100 శాతం సబ్సిడీతో ఎరువులు, పురుగు మందులను ప్రభుత్వం పంపిణీ చేసింది. 2020లో ట్రైబల్ సబ్ప్లాన్ కింద జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా 50మంది రైతులకు 50 ఎకరాలకు 100 శాతం సబ్సిడీపై వరి విత్తనాలు, పురుగు మందులు, ముగ్గురికి ఒకటి చొప్పున స్ప్రే మిషన్, పశువుల బురద గొర్లును అందించింది. గ్రామంలో 12మంది ఆడబిడ్డలు కల్యాణలక్ష్మి పథకం ద్వారా పెండ్లి చేసుకున్నారు.
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో భాగంగా ములుగు జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న తొలి గ్రామంగా 2017లో అంకన్నగూడెం రికార్డులకెక్కింది. ప్రభుత్వం మంజూ రు చేసిన 46 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తయ్యాయి. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5.04 లక్షలు అందించింది. ఇప్పుడు ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఇంటి స్థలం ఉన్నవారు ఇండ్ల నిర్మాణానికి ముందుకొస్తున్నారు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత పల్లెల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించటంతో అంకన్నగూడెం రూపురేఖలు మారిపోయాయి. రవాణా సౌకర్యం మెరుగుపడటంతో వసతులు కూడా పెరిగాయి. గ్రామంలో చదువుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. తమ పిల్లలను తల్లిదండ్రులు ములుగు, హనుమకొండ, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు పంపిస్తూ చదివించుకుంటున్నారు. గత ఎనిమిదేండ్లలో గ్రామంలో 40 మంది వరకు డిగ్రీ వరకు చదువుకోగా 10మంది బీఈడీ చదువుకున్నారు. వీరిలో ఒకరు పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాన్ని సైతం పొందారు. పెరిగిన వసతుల కారణంగా ప్రజల జీవన విధానంలోనూ మార్పు వచ్చింది. సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. అప్పట్లో గరిష్ఠంగా 400 ఎకరాల్లో సాగు చేస్తే ఇప్పుడు 700 నుంచి 800 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు.