హైదరాబాద్, జూన్ 1(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ ఈ నెల 9 నుంచి ప్రారంభం అవుతుందని పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. గొర్రెల పంపిణీ, దశాబ్ది ఉత్సవాలు, ఫిష్ ఫెస్టివల్పై సచివాలయంలో గురువారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాల్లో పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధిశాఖల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, లబ్ధిదారులకు జరిగిన మేలు వంటి వాటిని కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించాలని సూచించారు. 8న చెరువుల పండుగ సందర్భంగా చెరువులు, రిజర్వాయర్ల వద్ద వేదికలు ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీ, ఇతర పథకాలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమీక్షలో విజయ డెయిరీ చైర్మన్ సోమా భరత్కుమార్, గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మ న్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజుయాదవ్, మత్స్య సహకార సంఘాల చైర్మన్ పిట్టల రవీందర్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
మాదాసి కురుమలకు కూడా సబ్సిడీ గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై మాదాసి కురుమలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాలకు చెందిన మాదాసి కురుమలు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను వేరు వేరుగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించే విధంగా ప్రభుత్వం చేయూతను అందిస్తున్నదని తెలిపారు. ఆలంపూర్, కొల్లాపూర్, జోగులాంబ గద్వాల నియోజకవర్గాల పరిధిలో ఉన్న సుమారు 32 వేల మంది మాదాసి కురుమలకు గొర్రెల యూనిట్లను అందజేస్తామని మంత్రి తెలిపారు.