హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): అమాయక అంగన్వాడీలను రెచ్చగొడుతున్నదెవరు? ఉమ్మడి రాష్ట్రంలో రోజుల తరబడి సమ్మెచేసినా అంగన్వాడీలకు ప్రభుత్వాలు ఒక్క రూపాయి వేతనం పెంచలేదు. కానీ, నేడు ఏ వినతిపత్రం ఇవ్వకపోయినా మూడుసార్లు వేతనం పెంచిన తెలంగాణ సర్కార్ మీదికి అంగన్వాడీలను ఉసిగొల్పుతున్నది ఎవరు? తమ ఉనికిని కాపాడుకోవటం కోసం రెండు సంఘాలు ఈ పని చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కున చేర్చుకొని అండగా నిలిచిన సర్కారుపై విషం చిమ్మే కుట్రలో భాగంగానే అంగన్వాడీలతో బలవంతపు సమ్మె చేయిస్తున్నారనే వాదనకు ఆదిలాబాద్ ఘటన నిదర్శనమనే వాదన వినిపిస్తున్నది. అంగన్వాడీ కేంద్రం ప్రభుత్వ ఆస్తి.. ప్రభుత్వ ఆస్తిని సొంత ఆస్తిగా భావించి వాటికి తాళాలు వేసి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు భంగం కలిగించి తద్వారా ప్రభుత్వంపై తమ అక్కసును కొన్ని సంఘాలు వెళ్లగక్కుతున్నాయి.
దేశవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలు కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయనే విషయం తెలిసినా క్రమబద్దీకరణ చేయిస్తామని అంగన్వాడీలను రెచ్చగొట్టి సమ్మెకు దించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రాట్యుటీకి అంగన్వాడీ టీచర్లు, సహాయకులు అర్హులు కారని తెలిసినా ఆ డిమాండ్తో వారిని సమ్మెలోకి దించటం వెనుక సంఘాల ప్రయోజనాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అంగన్వాడీ టీచర్లు, సహాయకులను బలవంతంగా సమ్మెలోకి దించిన సంఘాల పురుష నాయకుల ముసుగులు తొలగిపోతున్నాయి. నిన్నమొన్నటి దాకా పనిమంతులుగా, సర్కార్ పథకాలను ప్రజలకు చేర్చటాన్ని తమ బాధ్యతగా స్వీకరించిన కొంతమంది అంగన్వాడీ టీచర్లు, సహాయకులు సమ్మెకి దిగి తలలు పట్టుకుట్టుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 16 రోజులు సమ్మె చేసినా అప్పటి ప్రభుత్వాలు కనీసం రూ.100 కూడా వేతనం పెంచలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ స్వయం గా వారిని పిలిపించుకొని, వారి కష్టాలు తెలుసుకొని, వారితో కలిసి భోజనం చేసి ఏకంగా మూడుసార్లు వేతనాలు పెంచారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏవైనా సమస్యలుంటే సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సింది పోయి సంఘ నేతల ప్రయోజనాల కోసం సమ్మె చేయటమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సమ్మెకు దిగిన అంగన్వాడీలు కూడా పునరాలోచనలో పడ్డట్టు కనిపిస్తున్నది.
నిన్నమొన్నటి దాకా పశ్చిమ బెంగాల్ను దశాబ్దాలపాటు ఏలిన రాష్ట్రంలో అంగన్వాడీలకు అక్కడి ప్రభుత్వం చెల్లిస్తున్నది వేతనం కేవలం రూ.8,250, ప్రస్తుతం కేరళలో చెల్లిస్తున్నది రూ.6,500 మాత్రమే. కానీ, తెలంగాణలో నేడు అంగన్వాడీలకు రూ.13,650, మినీ అంగన్వాడీలు, ఆయాలకు రూ.7,800 వేతనం చెల్లిస్తున్నారు. దీంతో ప్రభుత్వంతో తగువులాడితే అసలుకే మోసం వస్తుందేమోనని అంగన్వాడీలు భయాందోళనల్లో పడ్డారు. పదవి విరమణ బెనిఫిట్స్ను ప్రభుత్వం ఇటీవల అంగన్వాడీలకు రూ.60 వేల నుంచి రూ.లక్షకు, ఆయాలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచింది. అలాగే మట్టి ఖర్చులను పెంచింది. కాగా, కొన్ని సంఘాలు తమ రాజకీయ లబ్ధికోసం అమాయక అంగన్వాడీలను బలిచేస్తున్నాయని స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చేసిన ప్రకటన వారిని పునరాలోచనలో పడేసింది. దీంతో అంగన్వాడీలు తమ సమ్మెపై విరమిస్తామని సంఘాల నేతలకు చెప్పగా ‘లేదు.. లేదు. సమ్మె చేయాల్సిందే.. ఈ నెల 26న చలో హైదరాబాద్ చేపడదాం’ అని వారు ఉసిగొల్పినట్టు సమాచారం.
ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మహిళా ఎస్ఐపై దాడికి పాల్పడిన అంగన్వాడీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న తలమడుగు ఎస్ఐ ధనశ్రీ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా అంగన్వాడీ టీచర్లు ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఎస్ఐ జుట్టుపట్టుకొని ఈడ్చుకెళ్లారు. భౌతికంగా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడికి దిగినవారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు రెండో పట్టణ పోలీస్స్టేషన్లో ఆందోళనకారులపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐటీయూ నాయకులతోపాటు ఏడుగురు అంగన్వాడీ టీచర్లపై కేసు నమోదు చేసినట్టు సీఐ అశోక్ తెలిపారు. వీడియోల ఆధారంగా మహిళా పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడిన వారందరిపై కేసు నమోదు చేస్తామని ఆయన వెల్లడించారు.