హైదారాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): కరోనా కారణంగా దాదాపు ఏడాదిన్నరగా మూసివేసిన అంగన్వాడీ కేంద్రాలు సెప్టెంబర్ 1 నుంచి తిరిగి తెరుచుకొనేందుకు సన్నద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో 149 ప్రాజెక్టుల పరిధిలోని 35,700 అంగన్వాడీ కేంద్రాలను లాక్డౌన్కు ముందున్న స్థితికి తీసుకురావాలని ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. అన్నికేంద్రాలను శానిటైజ్ చేసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్త్రీ, శిశు సంక్షేమశాఖ అన్నిజిల్లాల సంక్షేమశాఖ అధికారులను ఆదేశించింది. కరోనా కారణంగా అంగన్వాడీ కేంద్రాల లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే పోషకాహారపదార్థాలను ఇండ్లకే సరఫరా (టేక్ హోం రేషన్) చేస్తున్న విషయం తెలిసిందే. ఆరోగ్యలక్ష్మి, గిరిజన ప్రాంతాల్లో కొనసాగుతున్న గిరిపోషణ్, బాలామృతం, బాలామృతం ప్లస్ తదితర కార్యక్రమాల కింద ప్రభుత్వం పంపిణీ చేసే పోషకాహారాన్ని వచ్చేనెల 1 నుంచి అంగన్వాడీ కేంద్రాల్లోనే వండి అందించేందుకు సిద్ధమవుతున్నారు.