Nagarjuna Sagar | దామరచర్ల, ఏప్రిల్ 19: నాగార్జునసాగర్ ప్రాజెక్టు దిగువన నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం చిట్యాల వద్ద నిర్మించిన టెయిల్పాండ్ ప్రాజెక్ట్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రా అధికారులు తరలించుకుపోయారు. ఈ నెల 15 నుంచి వరుసగా మూడు రోజుల పాటు టెయిల్పాండ్ నుంచి దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్ట్కు నీటిని విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో తాగునీటి కోసమే నీటిని విడుదల చేసినట్టు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే సాగర్ కుడికాల్వ ద్వారా మూడుసార్లు నీటిని విడుదల చేసిన ఆంధ్రా అధికారులు ప్రస్తుతం టెయిల్పాండ్ నుంచీ నీటిని విడుదల చేసుకున్నారు.
నాగార్జున సాగర్లో విద్యుదుత్పత్తి కోసం వాడిన నీరు దిగువకు పోకుండా నిల్వ చేసేందుకు డ్యాం నుంచి 21 కిలోమీటర్ల దూరంలో చిట్యాల వద్ద కృష్ణానదిపై టెయిల్పాండ్ ప్రాజెక్ట్ నిర్మించారు. సాగర్లో విద్యుదుత్పత్తి ద్వారా విడుదలైన నీటిని ప్రాజెక్టులో నిల్వచేసి రివర్స్ టర్బైన్ల ద్వారా తిరిగి సాగర్ జలాశయంలోకి పంపిస్తున్నారు. ఈ ఏడాది సాగర్లో తగినంత నీరులేక పోవడంతో జలవిద్యుదుత్పత్తిని నిలిపివేశారు. సాగర్ ప్రాజెక్ట్ దిగువ నుంచి టెయిల్పాండ్ వరకు 21 కిలోమీటర్ల మేర నిత్యం 7 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎన్నడూ ఈ నీటిని విడుదల చేయలేదు. సాగర్కు వరద నీరు అధికంగా వచ్చినప్పుడు మాత్రమే నీటిని దిగువకు వదిలేవారు.
కృష్ణాబేసిన్లో తీవ్ర నీటిఎద్దడి నెలకొన్న క్రమంలో కేఆర్ఎంబీ ఆధ్వర్యంలో ఇటీవల ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు సమావేశమయ్యారు. నాగార్జునసాగర్ జలాశయంలో 500 అడుగులకు పైన ఉన్న 14 టీఎంసీల నీటిని తాగునీటి కోసం వాడుకోవాలని, ఇందులో తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఆంధ్రాకు 5.5 టీఎంసీలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేఆర్ఎంబీ కేటాయింపుల మేరకే టెయిల్పాండ్లోని నీటిని వాడుకున్నట్టు ఆంధ్రా అధికారులు చెప్తున్నారు. సాగర్ జలాశయంలోని 14 టీఎంసీల నీటి విషయంలోనే పంపకాలు జరిగినప్పుడు దిగువన టెయిల్పాండ్లో నిల్వ ఉన్న నీటికి ఈ కేటాయింపులు ఎలా వర్తిస్తాయని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు.
టెయిల్పాండ్ బ్యాక్ వాటర్ వద్ద తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ప్రాజెక్ట్ మెయిన్ పంప్హౌస్ను నిర్మించింది. ఇక్కడి నుంచి నీటిని తీసుకొని శుద్ధిచేసి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట నియోజక వర్గాల్లోని 510 గ్రామాల్లోని ప్రతి ఇంటికీ తాగునీటిని అందిస్తున్నది. ప్రస్తుతం ఆంధ్రా అధికారులు టెయిల్పాండ్ జలాశయం నుంచి 4 టీఎంసీల నీటిని తరలించుకు పోవడం వల్ల ప్రాజెక్టులో 2.9 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఆంధ్రా అధికారులు మరోమారు ప్రాజెక్ట్ నుంచి నీటిని తరలించుకుపోతే మిషన్ భగీరథకు ఇబ్బందులు తప్పవు. టెయిల్పాండ్ నుంచి ఆంధ్రా అధికారులు నీటిని దిగువకు విడుదల చేసిన సమాచారం అందడంతో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా, సంబంధిత అధికారులు గురువారం చిట్యాల వద్ద కృష్ణానదిపై ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ ప్రాజెక్ట్ను పరిశీలించారు. జలాశయంలో నీరు తగ్గిపోవడంతో పంప్హౌస్ వద్ద నదిలో ఏర్పాటు చేసిన అదనపు మోటార్లను నదిలోకి దింపారు.
గతంలో సమైక్య రాష్ట్రంలో నాగార్జునసాగర్ నుంచి ఆంధ్రాకు ఇష్టారీతిన నీటిని తరలించుకుపోయారు. సాగర్లో విద్యుదుత్పత్తి కోసం వినియోగించిన నీటిని రివర్సబుల్ పంపింగ్ ద్వారా తిరిగి సాగర్ జలాశయంలోకి పంపాలనే నిబంధన ఉన్నా పట్టించుకోకుండా నీటిని దిగువన ఉన్న కృష్ణాడెల్టాకు తీసుకెళ్లేవారు. టెయిల్పాండ్ నిర్మాణం తర్వాత కూడా ఇదే తంతు కొనసాగింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం విద్యుదుత్పత్తి ద్వారా విడుదలైన నీటిని టెయిల్పాండ్ వద్ద నిల్వ చేసింది. అవసరమైన సందర్భాల్లో రివర్సబుల్ పంపింగ్ ద్వారా సాగర్ జలాశయంలోకి తరలించింది. తొమ్మిదిన్నరేండ్లపాటు చుక్కనీటిని కూడా దిగువకు వదల్లేదు. ప్రభుత్వం మారిన నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ సర్కారుకు తిరిగి పాతకథ మొదలుపెట్టడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.