SSC Exams | ఆదిలాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమంపై విషపు రాతలు, తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టించిన ఆంధ్రా పత్రికలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక అబద్ధాలు రాస్తున్నాయి. తాజాగా ఈనాడు ఇలాంటి కథనాన్నే ప్రచురించింది. ‘పరీక్షలయ్యే వరకు ఇంటికి దూరంగానే..’ శీర్షికతో ఈనాడు దినపత్రికలో ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే ‘నమస్తే తెలంగాణ’ పరిశీలనలో అది పూర్తిగా అబద్ధం అని తేలింది. సోమవారం నమస్తే తెలంగాణ బృందం కరంజి-టి నుంచి అందర్బంద్ రోడ్డును పరిశీలించి, పరీక్షలు రాస్తున్న విద్యార్థులు, వాహనదారులు, స్థానికులతో మాట్లాడి రోడ్డు, రవాణా సౌకర్యాలను సేకరించింది. సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం కరంజి-టీ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులు 26 మందికి ఆ మండలంలోని అందర్బంద్ ఆశ్రమ పాఠశాలలో పరీక్ష కేంద్రం కేటాయించారు. 30 కిలోమీటర్ల దూరం ఉన్న అందర్బంద్కు రోడ్డు, రవాణా సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులతోపాటు సరుకులు, వంట సామగ్రి తీసుకుని అందర్బాద్కు చేరుకున్నారని పరీక్షలు ముగిసేంతవరకు గ్రామంలోని ఉంటారని ఈనాడు కథనం. ఈ కథనం వాస్తవానికి విరుద్ధంగా ఉన్నది. బట్టకాల్చి మీద వేసే పనికి ఆంధ్రా పత్రిక పూనుకొంటున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పదేండ్లుగా గ్రామానికి వస్తూ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు
కరంజి-టి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో వారికి మండలంలోని 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందర్బంద్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పరీక్ష కేంద్రం కేటాయిస్తారు. పదేండ్లుగా కరంజి-టీ విద్యార్థులు అందర్బంద్కు వచ్చి పదో తరగతి పరీక్షలు రాస్తున్నారని స్థానికులు తెలిపారు. కొందరు తల్లిదండ్రులు విద్యార్థులను తీసుకొచ్చి గ్రామంలో వసతి సౌకర్యం కల్పించి, పరీక్షలు అయ్యే వరకు ఉంచుతారు. ఇద్దరు వంట మనుషులతోపాటు వంటకు సరిపడా సామగ్రిని తీసుకొస్తారు. పరీక్షలు అయ్యాక విద్యార్థులు సొంత గ్రామానికి వెళ్లిపోతారు.
రోడ్లు, రవాణాకు ఇబ్బందులు లేవు
కరంజి-టీ నుంచి అందర్బంద్కు 24 కిలోమీటర్ల దూరం ఉండగా బీటీ రోడ్డు సౌకర్యం ఉన్నది. ఆర్టీసీ బస్సులు, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాల వ్యాన్లు, లారీలు, వ్యాన్లు, జీపులు, బైక్లు నడుస్తాయి. కరంజి-టి, ధనోర, దోన, అందర్బంద్లో వందల వాహనాలు ఉన్నాయి. ఆదిలాబాద్తోపాటు ఈ గ్రామాలకు చెందిన వందల వాహనాలు ఈ రోడ్డు గుండా ప్రయాణం సాగిస్తాయి. అందర్బంద్లో పదో తరగతి పరీక్ష కేంద్రం ఉండటంతో ఆర్టీసీ కూడా గ్రామానికి ప్రత్యేక బస్సును నడుపుతున్నది.
దూరం ఉన్నదని ఇక్కడే ఉంటున్నాం
పరీక్ష కేంద్రం మా గ్రామానికి 24 కిలోమీటర్లు దూరం ఉంటుంది. దూరంగా ఉండటంతో పరీక్షల సమయంలో ఇబ్బందులు రాకుండా ఇక్కడే ఉంటున్నాం. మా అమ్మానాన్న ఇక్కడ భోజనం, వసతి సౌకర్యం ఏర్పాటు చేసి వెళ్లారు.
– రాజేశ్, పదో తరగతి విద్యార్థి, కరంజి-టీ
పదేండ్ల నుంచి పరీక్ష రాయడానికి వస్తున్నారు
కరంజి-టీ నుంచి విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయడానికి పదేండ్లుగా వస్తున్నారు. తల్లిదండ్రులు విద్యార్థులను ఇక్కడికి తీసుకొస్తారు. వంట సామగ్రి, వంట మనుషులు కూడా వస్తారు. స్థానికులతో మాట్లాడి వారికి వసతి సౌకర్యం కల్పిస్తారు. పదేండ్లుగా ఇలాగే కొనసాగుతున్నది. ఎప్పటిలాగే ఈసారి కూడా కరంజి-టి నుంచి పరీక్షలు రాయడానికి విద్యార్థులు వచ్చారు. మేం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తుంటాం.
–సంతోష్, స్థానికుడు, అందర్బంద్, భీంపూర్, ఆదిలాబాద్ జిల్లా