Andhrajyothy | తెలంగాణ సర్కారు సాయంతో తేరుకొంటున్న మోరంచపల్లిపై ‘అంధజ్యోతి’ మళ్లీ బురదజల్లింది. వరద సృష్టించిన బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే తెరిపిన పడుతున్న గ్రామస్థుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా గలీజు రాతలు రాసింది. వరదరోజుల నుంచీ అధికారయంత్రాంగం మొత్తం గ్రామంలోనే ఉండి సహాయక చర్యల్లో నిమగ్నమైతే కళ్లుండీ చూడలేని కబోదిలా ఆంధ్రజ్యోతి పత్రిక అసత్యపు కథనాన్ని ప్రచురించింది. తెగిన రోడ్లను, విద్యుత్తును పునరద్ధరిస్తూ.. గ్రామంలోని ఇండ్లను శుభ్రంచేస్తూ ప్రభుత్వ యంత్రాంగం సీరియస్గా పనిచేసుకుంటూ పోతుంటే మోరంచపల్లికి అసలు ప్రభుత్వ సాయమే అందలేదంటు నిస్సిగ్గు కథనాన్ని వండివార్చింది. దీనిపై కలెక్టర్ భవేశ్ రిజాయిండర్ జారీ చేసి, ఆంధ్రజ్యోతి వార్తల్లో వాస్తవంలేదని తేల్చిచెప్పారు.
భూపాలపల్లి టౌన్, జూలై 31: ఏడాదిలో కురవాల్సిన వాన ఒక్కరోజులోనే కురిసింది. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచ వాగు పొంగిపొర్లడంతో మోరంచపల్లి గ్రామం నీటమునిగింది. విషయం తెలుసుకొన్న తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. ఆర్మీ అధికారులతో మాట్లాడి, రెండు హెలికాప్టర్లతోపాటు ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బందిని గ్రామానికి పంపించింది. వెయ్యి మంది గ్రామస్థులను పునరావాస కేంద్రాలకు సురక్షితంగా తరలించింది. అప్పటినుంచి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్మిశ్రా నిత్య పర్యవేక్షణలో అధికార యంత్రాంగం మొత్తం గ్రామంలోనే ఉండి సహాయక చర్యలు చేపడుతున్నది. వరదలు వచ్చినరోజు నుంచీ అలుపెరగకుండా సహాయ చర్యలు, మరమ్మతు పనులు జోరుగా సాగుతున్నాయి.
మొదటి రోజు..
జూలై 26 అర్ధరాత్రి దాటాక మోరంచ ఉగ్రరూపం దాల్చి వరద మోరంచపల్లి గ్రామాన్ని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసింది. జూలై 27 తెల్లవారుజామున 4 గంటలకే అధికార యంత్రాంగం మోరంచ ప్రవాహం వద్దకు చేరుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి ఆర్మీ అధికారులతో మాట్లాడి హెలికాప్టర్లను గ్రామానికి పంపారు. జిల్లా ఉన్నతాధికారులు కరీంనగర్ నుంచి బోట్లను తెప్పించి సుమారు వెయ్యి మందిని ఒడ్డుకు చేర్చారు. గణపురం మండలం కర్కపల్లి ప్రభుత్వ, గాంధీనగర్లోని సీఎస్ఐ పాఠశాలల్లో ఆశ్రయం కల్పించారు. వైద్య సిబ్బందితో వైద్యం అందించారు. అందరికీ భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు.
రెండోరోజు..
వరదలు తగ్గిన వెంటనే ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం సహాయ చర్యలు ముమ్మరం చేసింది. శుక్రవారం పునరావాస శిబిరాల్లో ఉన్న బాధితులకు ఆహారం అందిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. మంత్రి సత్యవతి, ఎమ్మెల్యే గండ్ర, కలెక్టర్, ఎస్పీ గ్రామానికి చేరుకొని ప్రతి ఇల్లూ తిరిగి పరిస్థితిని తెలుసుకొన్నారు. పునరావాస కేంద్రాలను సందర్శించి ఆహారం, దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రతి ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తూ బ్లీచింగ్ చేయించారు.
మూడోరోజు..
మోరంచపల్లి క్రమంగా కోలుకున్నది. జిల్లా అధికార యంత్రాంగం శనివారం గ్రామంలోనే తిష్టవేసి సహాయక చర్యలు కొనసాగించింది. పారిశుధ్య పనులు ముమ్మరం చేశారు. బాధితులకు మూడు పూటలా భోజనం అందించారు. గండ్ర మోహన్రెడ్డి మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి ఇంటికీ రూ.4 వేల సాయం అందించారు. నష్టంపై అధికారులు ప్రత్యేక బృందాలతో సర్వే నిర్వహించారు. పారిశుధ్య పనులు కొనసాగాయి.
నాలుగోరోజు..
వరదలు సృష్టించిన బీభత్సం నుంచి మోరంచపల్లి గ్రామం కోలుకుంటూ శుభ్రం అయ్యింది. వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ అనారోగ్య సమస్యలు తెలుసుకొంటూ మందులు పంపిణీ చేశారు. పశువైద్య అధికారులు పశువులకు చికిత్సలు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన 25 కిలోల బియ్యాన్ని, మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే గండ్ర, జడ్పీ చైర్పర్సన్ శ్రీహర్షిణి, కలెక్టర్ ఆదివారం సాయంత్రం పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్విరామంగా సేవలు అందించడంతో గ్రామం కొంత మేర గాడిన పడింది.
పూర్తిస్థాయిలో రాకపోకలు
మోరంచ వరద ఉధృతికి తెగిపోయిన రోడ్లకు అధికార యంత్రాంగం అక్కడే తిష్ట వేసి కేవలం నాలుగు రోజుల్లో మరమ్మతులు పూర్తి చేసింది. వెంటనే రాకపోకలను పునరుద్ధరించారు. ఆదివారం సాయంత్రం నుంచి మోరంచపల్లి గ్రామం ప్రధాన రహదారి నుంచి పూర్తిస్థాయిలో రాకపోకలు కొనసాగుతున్నాయి.
‘ఆంధ్రజ్యోతి’ కథనంలో వాస్తవం లేదు: కలెక్టర్
భూపాలపల్లి రూరల్: మోరంచపల్లి బాధితులకు ప్రభుత్వ సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని కలెక్టర్ భవేశ్మిశ్రా తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో ‘మోరంచపల్లి మొర’ పేరుతో వచ్చిన వార్త కథనంపై ఆయన రిజాయిండర్ జారీ చేశారు. ఆ కథనంలో వాస్తవం లేదని తేల్చిచెప్పారు. గ్రామస్థులను పునరావాస కేంద్రాలకు తరలించి మూడు పూటలా భోజన సదుపాయం కల్పించామని తెలిపారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ విద్యుత్తు, తాగునీటి సరఫరాను పునరుద్ధరించామని, బురదమయమైన ఇండ్లను శుభ్రపరిచామని, పూర్తిగా ధ్వంసమైన రోడ్డును 48 గంటల్లో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేసి రవాణాను పునరుద్ధరించామని తెలిపారు. గ్రామంలో సుమారు 300 కుటుంబాలకు బెడ్షీట్, బకెట్, బట్టలు, వాటర్ క్యాన్లు, 15 రకాల నిత్యావసర సామగ్రి అందించామని వెల్లడించారు.
మంచిగ చూసుకుంటున్నరు
వరదల్ల ఊరు మునిగిన కాన్నుంచి మమ్మల్ని కర్కపల్లి బడిలకు తీసుకచ్చిండ్రు. అధికారులు బట్టలు, చెద్దర్లు, సామాన్లు ఇచ్చి మూడు పూటలా అన్నం పెడుతున్నరు. మావోళ్లు ఇంటికి వెళ్లి ఇళ్లను సాఫ్ చేస్తుండ్రు. ఏ లోటు లేకుండా చూసుకుంటున్నరు. సర్కారోళ్లు బియ్యం, సామాన్లు, బకెట్లు ఇచ్చిండ్రు. చాలా మంది తోచిన సాయం చేస్తుండ్రు. ఇంటి ముంగట అంతా సాఫ్ చేసిండ్రు. కరెంటు కూడా వచ్చిందట. ఇళ్లు మంచిగ కాంగనే పోతం.
– రొంటాల లక్ష్మి, మోరంచపల్లి
సమయానికి ఆదుకున్నరు
మాది చెంచుకాలనీ. ఒక్కసారిగా వరద మా కాలనీలోకి వచ్చింది. అందరం ఒకరినొకరం పట్టుకొని అక్కడే ఉన్న డాబా మీదకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నం. తెల్లారి సార్లు పడవలు పంపించి మమ్మల్ని కాపాడిన్రు. అందరినీ తీసుకెళ్లి కర్కపల్లి బడిలో ఉంచి అన్నం పెట్టి ఆదుకున్నరు. ఆనాడు సార్లు పడవలు పంపకపోతే మా పరిస్థితి ఎలా ఉండేదో. అదే వర్షంలో అన్నం తెచ్చిపెట్టి ఆకలి తీర్చిండ్రు. 25 కిలోల బియ్యం, సామాన్లు ఇచ్చిన్రు.
– ఇండ్ల నవీన్, చెంచుకాలనీ (మోరంచపల్లి)
సార్లు మాకు ఇండ్లు ఇత్తా అన్నరు..
నీళ్లల్ల మునిగిన కాడి నుంచి సార్లు మమ్మల్ని కాపాడి మంచిగ చూసుకుంటున్నరు. ఎమ్మెల్యే సారు, కలెక్టరు సారు మాకు పెద్ద దిక్కయినరు. ఇప్పటివరకు ఏ లోటూ రానియ్యలే. మాకు ఇళ్లు కావాలె అని అడిగినం. భూపాలపల్లిల కట్టిన ఇండ్లు ఇస్తమన్నరు. అక్కడ మాకు వద్దు, అక్కడ పనులు ఉండవని చెప్పినం. ఊళ్లెనే కట్టిచ్చి ఇస్తమన్నరు.
– మేకల చిలుకమ్మ, చెంచుకాలనీ (మోరంచపల్లి)
ఫైరింజన్తో శుభ్రం చేశారు
వరదలు పెద్ద ఎత్తున రావడంతో అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించి అండగా నిలిచారు. వరదలు తగ్గుముఖం పట్టాక ఇల్లు శుభ్రం చేసుకోవడానికి ఫైరింజన్ పంపించిన్రు. ఇళ్లంతా శుభ్రం అయింది. ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నం.
-బారసాల రమాదేవి, మోరంచపల్లి