కేంద్ర ప్రభుత్వం దేశంలో ఆరు చోట్ల 1,600 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను టీవోటీ విధానంలో రూ.26 వేల కోట్లకు 15-30 ఏండ్ల లీజు ప్రాతిపదికన ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టింది. మరి వాటిపై ఆంధ్రజ్యోతి పత్రిక జాతీయ రహదారులను మోదీ సర్కారు ప్రైవేటుకు కట్టబెట్టింది అని ఎందుకు రాయలేదు?
మోదీ సర్కార్ ప్రభుత్వరంగ సంస్థలను అంగట్లో నిలబెట్టి ప్రైవేటుపరం చేస్తుంటే ఏనాడైనా ఈ ఆంధ్రజ్యోతి గుండెలు బాదుకొన్నదా? కనీసం ఇదెక్కడి అన్యాయమంటూ లోపలి పేజీల్లోనైనా చిన్న వార్తను ప్రచురించిందా? తెలంగాణ ప్రభుత్వం ఓఆర్ఆర్ను శాశ్వతంగా ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టడం లేదు. లీజుకు మాత్రమే ఇచ్చింది. లీజు పూర్తయిన తర్వాత మళ్లీ అది రాష్ట్రప్రభుత్వం చేతిలోకి వస్తుంది కదా? అయినా అవేవీ తెలియనట్టు ఆంధ్రజ్యోతి అబద్ధాలను వండివార్చింది. వార్తాకథనానికీ వాస్తవాలకూ మధ్య తేడాపై గుండాల కృష్ణ విశ్లేషణ..
(గుండాల కృష్ణ)
ORR | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగురోడ్డు నిర్వహణ, టోల్ వసూలు టెండర్పై ఆంధ్రజ్యోతి దినపత్రిక అక్కసు వెళ్లగక్కబోయి అడ్డంగా బుక్కైంది. శుక్రవారం ‘రాసిచ్చేశారు’ శీర్షికన ప్రచురించిన బ్యానర్ వార్తలో కనీసం పరిజ్ఞానం లేకుండా కాకి లెక్కలు వేసింది. కనీస భాగహారం లెక్కలు కూడా రావన్న తన అజ్ఞానాన్ని బయటపెట్టుకొన్నది. ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్) నిర్వహణ, టోల్ వసూలు కోసం రాష్ట్ర ప్రభుత్వం టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీవోటీ) పద్ధతిన ముంబైకి చెందిన ఐఆర్బీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు లీజుకు ఇచ్చింది. ఈ టెండర్ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పూర్తి పారదర్శకంగా జరిగింది. ఇందులో ఏ దాపరికమూ లేదు. ఇదే విధానంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు జాతీయ రహదారులను కూడా ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇచ్చింది. కానీ, ఓఆర్ఆర్ కాంట్రాక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మహా ఘోరమైన తప్పిదం చేసినట్టు ఆంధ్రజ్యోతి పత్రిక కలగన్నది. నిజాలకు మసిపూసి మారేడుకాయ చేసి ఓ వార్తను వండివార్చింది. ఆ పత్రిక లేవనెత్తిన ప్రధాన ప్రశ్నే విచిత్రంగా, అసంబద్ధంగా ఉన్నది. ఈ కాంట్రాక్టు ద్వారా రాష్ట్రప్రభుత్వం ఒకేసారి రూ.7,380 కోట్లు ఎలా వసూలు చేసుకొంటది? భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలకు ఏమీ మిగిల్చదా? అని సిల్లీ ప్రశ్న వేసింది.
మేలు మార్గం-1
ప్రస్తుత టెండర్ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఒకేసారి రూ.7,380 కోట్ల ఆదాయం సమకూరింది. 30 ఏండ్లకు ఈ మొత్తాన్ని భాగిస్తే ఏటా రూ.248 కోట్లు అని లెక్కగట్టింది. ఏకమొత్తంగా వచ్చే ఈ రూ.7,360 కోట్లను తొమ్మిది శాతం వడ్డీకి ఏ బ్యాంకులో వేసినా ఏటా సుమారు రూ.664 కోట్లు వడ్డీ వస్తుంది. ఇప్పటివరకు ఓఆర్ఆర్ నిర్వహణ కోసం హెచ్ఎండీఏ ఏటా రూ.150 కోట్ల వరకు ఖర్చుచేస్తున్నది. ఇప్పుడు నిర్వహణ భారాన్ని టెండర్ దక్కించుకొన్న సంస్థే భరిస్తుంది కాబట్టి ప్రభుత్వానికి ఏటా రూ.150 కోట్లు మిగిలినట్టే. ఇవి కూడా కలుపుకొంటే రూ.1,062 కోట్లు అవుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయినట్టు ఎట్ల?
మేలు మార్గం-2
ఒక అంచనా ప్రకారం రూ.7,380 కోట్లను బ్యాంకులో వేసి, ఆంధ్రజ్యోతి చెప్పినంత ఆదాయాన్ని దాంట్లోంచి తీసివేసినా వచ్చే వడ్డీతో లెక్కించుకొంటే 30 ఏండ్ల తర్వాత కూడా అకౌంట్లో దాదాపు రూ.21 వేల కోట్లు ఉంటాయి.
మేలు మార్గం-3
ఓఆర్ఆర్ నిర్మాణానికి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం జపాన్ బ్యాంకు (జైకా) రుణం తీసుకొన్నది. రూ.3,123 కోట్లు మంజూరైతే.. రూ.2,800 కోట్లు రుణం తీసుకున్నారు. దానికి ఏటా వడ్డీ కలుపుకొని సుమారు రూ.380 కోట్ల వరకు చెల్లిస్తున్నారు. ఇలా ఆర్నెల్లకోసారి 40 వాయిదాలు (20 సంవత్సరాల ఆరు నెలలు) చెల్లించాలి. వాస్తవానికి రూపాయి విలువ పడిపోవటంతో జపాన్ కరెన్సీ ‘యెన్’తో బేరీజు వేస్తే.. యెన్ విలువ 50 శాతం పెరిగింది. దీంతో కేవలం ఈ పెరుగుదలతో రుణం మొత్తం సుమారు రూ.1,500 కోట్ల వరకు పెరిగిందని అంచనా. ఈ క్రమంలో టీవోటీ ద్వారా సమకూరిన రూ.7,380 కోట్ల మొత్తాన్ని ఇదే జైకా నుంచి రుణంగా తీసుకొంటే.. 20 సంవత్సరాల పాటు ఏటా రూ.వెయ్యి కోట్ల వరకు వాయిదా చెల్లించాలి. ఈ చొప్పున ఓఆర్ఆర్ లీజు తెలంగాణకు లాభమా? నష్టమా?
మేలు మార్గం-4
టీవోటీ ద్వారా ఇప్పుడు రూ.7,380 కోట్లు ఒకేసారి వచ్చాయి. ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఒకవేళ ఇంత మొత్తం రాకపోతే… ప్రాజెక్టులు చేపట్టడం ఆలస్యమవుతుంది. తద్వారా అంచనా వ్యయం ఇప్పుడున్న ధరల ప్రకారమైతే… ఏటా కనిష్ఠంగా 20 శాతం పెరుగుతుంది. అంటే రూ.7,380 కోట్ల ప్రాజెక్టుల అంచనా వ్యయం ఏటా సుమారు రూ.1,476 కోట్ల మేర పెరుగుతుంది. అంటే ఈ ప్రాజెక్టులు పదేండ్లు ఆలస్యమైతే అదనంగా రూ.14వేల కోట్లు తోడై… అంచనా వ్యయం రూ.22 వేల కోట్లకు చేరుకొంటుంది. కానీ ఇప్పుడు ఈ నిధులతో శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తాయి. ప్రజలకు సౌకర్యాలు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రజల మేలు కోరే ప్రభుత్వం ఇంతకన్నా భిన్నంగా ఎలా ఆలోచిస్తుంది?
మేలు మార్గం-5
ఓఆర్ఆర్ నిర్వహణ, మరమ్మతులు, లైటింగ్, ఇంజినీరింగ్ వ్యవస్థ, సిబ్బంది.. ఇలా రకరకాలుగా ఏటా హెచ్ఎండీఏ రూ.100-150 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నది. ఇక నుంచి 30 ఏండ్లపాటు ఈ టెండర్ దక్కించుకొన్న కంపెనీనే చూసుకొంటది. అంటే హెచ్ఎండీఏకు నిర్వహణ భారం వచ్చే 30 ఏండ్లలో రూ.3,000-4,500 కోట్ల వరకు తగ్గినట్టే కదా?
ప్రపంచవ్యాప్తంగా టీవోటీ
టీవోటీ అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న విజయవంతమైన విధానం. ప్రభుత్వాలు ఒకేసారి నిధులు సమకూర్చుకోవడంతో పాటు ప్రాజెక్టుల నిర్వహణ భారం లేకుండా కేవలం పర్యవేక్షణ ద్వారా వాటిని వినియోగంలో ఉంచుకొనేందుకు ఇదో ఉత్తమ మార్గంగా రుజువైంది. అందుకే అనేక దేశాలు ఈ విధానాన్ని అమలుచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విధానంలో జాతీయ రహదారులను ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇచ్చింది. దేశంలో అతి పెద్ద టీవోటీ ప్రాజెక్టు ముంబై-పుణె ఎక్స్ప్రెస్ వే. దీనిని కూడా హైదరాబాద్ ఓఆర్ఆర్ టీవోటీని దక్కించుకొన్న ఐఆర్బీ కంపెనీనే తీసుకొన్నది. మహారాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ (ఎంఎస్ఆర్డీసీ) కూడా పలు ప్రాజెక్టులను టీవోటీ విధానంలో ఇచ్చింది. అందుకే తెలంగాణ ప్రభుత్వం కూడా సుదీర్ఘ కాలం పాటు ఈ విధానాన్ని అధ్యయనం చేసింది. టీవోటీ ద్వారా పెద్ద మొత్తం నిధులు వచ్చేలా ఒక కన్సల్టెన్సీని నియమించి సమగ్ర అధ్యయనం తర్వాతనే అడుగు ముందుకు వేసింది.
కనీస లెక్కలు తెలియని ఆంధ్రజ్యోతి
ఓఆర్ఆర్ టెండర్పై అబద్ధాలు వండివార్చిన ఆంధ్రజ్యోతి.. తమకు కనీస లెక్కలు కూడా రావన్న అజ్ఞానాన్ని బయటపెట్టుకొన్నది. ఓఆర్ఆర్ 30 ఏండ్ల లీజుకు ప్రభుత్వానికి వచ్చిన మొత్తం రూ.7,380 కోట్లు. అంటే ఏటా రూ.246 కోట్లు అవుతుంది. ఆంధ్రజ్యోతి మాత్రం ఏటా రూ.248 కోట్లుగా లెక్కగట్టింది. దీంతో ఈ మాత్రం లెక్కలు కూడా ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి తెలియవా? అని పాఠకులు ఎద్దేవా చేస్తున్నారు.