హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): ఇటీవల గోదావరి నదికి వచ్చిన వరదలతో భద్రాచలం మునిగిపోవటానికి ఏపీలో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు కారణం కాదని ఆ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు బుకాయించారు. భవిష్యత్తులో భద్రాచలం ముంపునకు గురికాకుండా ఉండాలంటే ఏపీలోని ఐదు గ్రామాలు తెలంగాణకు ఇవ్వాలన్న మంత్రి పువ్వాడ అజయ్ డిమాండ్ను అంబటి తిరస్కరించారు. మంగళవారం హైదరాబాద్ లేక్ వ్యూ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘7 మండలాలకు పోలవరం వల్ల ఇబ్బంది ఉంటుందనే వాటిని ఏపీలో కలిపారు. భద్రాచలంలో వరదలు వస్తే పోలవరం ఎలా కారణమవుతుంది? అన్ని సర్వేల తర్వాతే కేంద్రం అనుమతులు మంజూరుచేసింది. మీరు 5 గ్రామాలు ఇవ్వమంటే.. భద్రాచలం మాది అంటాం.. ఇస్తారా?’ అంటూ వితండ వాదనకు దిగారు. 5 గ్రామాలు తెలంగాణకు కావాలంటే కేంద్రాన్ని అడగండని ఎకసెక్కాలాడారు.
హైదరాబాద్ను ఇస్తారా?
ఏపీ మంత్రి బొత్స వితండవాదం
పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు ముప్పు ఉన్నదన్న తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ ప్రకటనపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వితండవాదనకు దిగారు. తెలంగాణ విడిపోవడం వల్ల హైదరాబాద్ ద్వారా ఏపీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోయిందని, గతంలా ఉమ్మడి రాష్ట్రంగానే ఉంచాలని తాము అడిగితే బాగుంటుందా? అని అర్థంపర్థంలేకుండా మాట్లాడారు. మంగళవారం ఆయ న మీడియాతో మాట్లాడుతూ.. ‘పోలవరం ఎత్తు ఎప్పుడు పెంచారు? డిజైన్ల ప్రకారమే నిర్మాణం జరుగుతున్నది. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఏమీచేయలేదు కదా?’ అన్నారు.
భద్రాచలం మాదే!
ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని
భద్రాచలం తమదని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నాని కొత్త రాగం అందుకొన్నారు. పోలవరం వల్ల భద్రాచలం మునిగిపోయే ప్రమాదం ఉన్నదని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వాస్తవానికి భద్రాచలం ఆంధ్రాదే. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం మునగడం అసత్యం. భద్రాచలం మునగడానికి పోలవరం కారణమైతే.. ఎగువన మంథని, మంచిర్యాల, ఏటూరునాగారం ఎందుకు మునిగాయి? భద్రాచలం సమీపంలోని ఎటపాక వద్ద 50 ట్రక్కుల మట్టిని నింపారని మంత్రి పువ్వాడ చెప్తున్నారు. ఆ మాత్రం మట్టిపోసే పోటుగాళ్లు మంచిర్యాల, మంథనిలో లేరా?’ అని అవమానించేలా మాట్లాడారు.