కొండపాక, అక్టోబర్ 30: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారంలో ఇటీవల శిథిలమైన మహంకాళి గుడి పునర్నిర్మాణానికి స్థానికులు పరిశీలించినప్పుడు ఓ మూలన దేవతావిగ్రహం కొత్తగా కనిపించింది. విషయం తెలుసుకున్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ గ్రామాన్ని సందర్శించి విగ్రహాన్ని పరిశీలించారు. ఈ దేవత చతుర్భుజి, నిజహస్తాలలో ఖడ్గం, రక్తపాత్ర, పరహస్తాలలో త్రిశూలం, సర్పసహిత ఢమరుకాలు ధరించి ఉన్నది.
తలపై మణిమకుటం, చెవులకు ప్రతపూరకాలు, మెడలో హార, గ్రైవేయకాలతో కనిపించే ఈ దేవత సుఖాసనంలో కూర్చుని ఉన్నది. అధిష్ఠానపీఠానికి రెండువైపులా ఏనుగులు, మధ్యన అష్టదళ కుసుమం ఉన్నాయి. దేవతకు రెండువైపులా రెండు చేతుల్లో కత్తి, రక్తపాత్రలతో చాముండి దేవతలున్నారు. వీరు దుర్గా లేదా కాళిక అనుచర దేవతలుగా చూపించారు. ఈ శిల్పం అరుదైనది. శైలిని బట్టి ఈ శిల్పం 16, 17వ శతాబ్దాల నాటిదిగా భావిస్తున్నారు.