యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 1: రాష్ట్రంలో అనతికాలంలోనే ఊహించని రీతిలో అభివృద్ధి జరిగిందని విద్యు త్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. రూ.6.90 కోట్ల వైటీడీఏ నిధులతో యాదగిరిగుట్టలో నిర్మించిన ఆర్టీసీ బస్సు ప్రాంగణాన్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలోపు పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేశారని తెలిపారు. మరోవైపు దేశమే అబ్బురపడే విధంగా రూ.1,280 కోట్లతో యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం చేసి రాష్ర్టాన్ని అభివృద్ధి పటంలో మొదటిస్థానంలో నిలిపారని కొనియాడారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా అనేక ప్రత్యేకతలతో యాదగిరిగుట్ట ఆలయం అభివృద్ధి జరిగిందని చెప్పారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా సకల సౌకర్యాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. దేశమంతా తెలంగాణ వైపే చూస్తున్నదని, సరిహద్దు రాష్ర్టాల ప్రజలంతా కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తు న్న మోసాలను దేశ ప్రజలు చూస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.