మునగాల, మార్చి 30: ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందడంతోపాటు బస్సు, బైక్ దగ్ధమయ్యాయి. ఈ సంఘటన గురువారం సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్ సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ డిపోకు చెందిన రాజధాని బస్సు హైదరాబాద్ నుంచి 13 మంది ప్రయాణికులతో విజయవాడ వెళ్తుండగా ఇందిరానగర్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న ఇందిరానగర్కు చెందిన రాజు(46) తీవ్రంగా గాయపడ్డాడు.
బైక్ బస్సు కింద ఇరుక్కుపోయింది. బస్సు అదే స్పీడులో వెళ్తుండగా నిప్పురవ్వలు చెలరేగాయి. దీన్ని గుర్తించిన ప్రయాణికులు డ్రైవర్ను అప్రమత్తం చేయగా బస్సును రోడ్డు పక్కన నిలిపాడు. ప్రయాణికులు బస్సు దిగి రాజును చికిత్స నిమిత్తం 108లో సూర్యాపేట ఏరియా దవాఖానకు తరలించారు. వైద్యులు చికిత్స చేస్తుండగా రాజు మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు మంటలను అదుపు చేశా రు. రాజు భార్య శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై లోకేశ్ తెలిపారు.