హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): తమ పక్కలో బల్లెంలా మారిన తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ ఎంతైనా ఖర్చు పెట్టడానికి పూనుకున్నది. ఒక్కో సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఏకంగా రూ.100 కోట్ల వరకు ఇవ్వడానికి సిద్ధమైంది. ఎమ్మెల్యేలు 20-30 మందినైనా కొనడానికి సిద్ధమేనని ప్రకటించింది. టీఆర్ఎస్కు ఒక్క ఎమ్మెల్యే రాజీనామా చేసినా నెల రోజుల్లోనే ప్రభుత్వాన్ని కూల్చేసేలా కుట్ర పన్నింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి శుక్రవారం వెబ్సైట్లలో, సోషల్ మీడియాలో బహిర్గతమైన రెండో ఆడియో టేప్లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో బీజేపీ మధ్యవర్తులు రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్ మాట్లాడుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోనే ఈ ఆపరేషన్ జరుగుతున్నట్టు అందులో రామచంద్ర భారతి స్పష్టంగా చెప్పారు. అంతేకాదు.. బీజేపీ రాష్ట్ర నేతలకు కొనుగోళ్ల విషయం తెలిస్తే చెడగొడతారని, అందుకే నేరుగా కేంద్రమే బేరసారాలు సాగిస్తున్నదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎలా కూలదోస్తారు? ఎంత ఖర్చు పెడతారు? ఢిల్లీ ప్రభుత్వంపై ఆపరేషన్ ఎలా చేస్తున్నారు? అన్నదానిపై బీజేపీ మధ్యవర్తులు కూలంకషంగా చర్చించారు. ‘ఇప్పుడు మీకు నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇస్తాను. ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆరుగురిని ఇస్తాను. మొత్తం 10 మందిని ఇస్తాను. కాంగ్రెస్వాళ్లు చాలా మంది రెడీగా ఉన్నారు’ అని నందకుమార్ చెప్పారు. దీనిని బట్టి పచ్చటి తెలంగాణలో రాజకీయ చిచ్చు పెట్టి అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్ర పన్నిందని అర్థం అవుతున్నది.
అమిత్ షాతో మాట్లాడి ఎంతైనా కొనుడే..
అమిత్ షా నేతృత్వంలోనే మనీ మాఫియా తెలంగాణలో అడుగుపెట్టిందని వారి సంభాషణలను బట్టి స్పష్టమవుతున్నది. ‘మునుగోడు ఎలక్షన్ కన్నా ముందే జరిగిపోవాలి. ఎవరెవరు వస్తారో జాబితా సిద్ధం చేసుకోండి. సంతోష్తో మాట్లాడుతాను. అమిత్ షా వరకు లైనప్ చేయాల్సి ఉంటుంది’ అని ఆడియోలో రామచంద్ర భారతి పేర్కొన్నారు. అంతేకాదు.. అనేకసార్లు అమిత్ షా పేరును ప్రస్తావించారు. ‘రోహిత్రెడ్డి తనతోపాటు ఇద్దరు వస్తారని చెప్పారు. అంటే మొత్తం ముగ్గురు. ఇదే విషయాన్ని సంతోష్కు చెప్తే.. వెంటనే అమిత్ షాతో కాన్ఫరెన్స్ కలిపారు. ఇద్దరు ముగ్గురి కోసం అక్కడికి (హైదరాబాద్) వెళ్లడం మంచిది కాదని అమిత్ షా చెప్పారు. వాళ్లనే ఢిల్లీకి పిలిపించి కలువమని సూచించారు’ అని పేర్కొన్నారు. ‘మునుగోడుకు ముందు చేరితే రూ.100 కోట్లు ఇస్తాం. సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎంత పెట్టి కొనడానికైనా బీజేపీ సిద్ధంగా ఉన్నది’ అని రామచంద్ర భారతి పేర్కొన్నారు. ‘మునుగోడుకు ముందే ఒక దెబ్బ పడాలి. ఆ తర్వాత స్కోప్ ఉండదు’ అని నందకుమార్ అన్నారు. ‘మునుగోడుకు ముందు.. సెంటర్ ఎప్పుడైనా డీల్కు రెడీగా ఉంటుంది. నంబర్-వన్తో డీల్ చేస్తున్నానని చెప్పాను’ అని అనడాన్ని బట్టి.. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ను మానసికంగా దెబ్బకొట్టి, తద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేయాలని బీజేపీ కుట్ర పన్నినట్టు స్పష్టం అవుతున్నది.
ప్రభుత్వాన్ని కూలగొట్టుడే..
‘రోహిత్ రాజీనామా చేసిన నెలరోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టగలడు. నలుగురు ఎమ్మెల్యేలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది’ అని రామచంద్ర భారతి చెప్పారు. దీనినిబట్టి బీజేపీ టార్గెట్ నలుగురు ఎమ్మెల్యేలను కొనడం కాదని, తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయాలన్న కాలకూట విషం దీనిలో దాగున్నదని అర్థం అవుతున్నది. ‘ఈ మిషన్ సక్సెస్ అయితే ప్రభుత్వం కూలిపోతుంది’ అని సింహయాజి వంతపాడారు. ఈ మిషన్ సక్సెస్ అయితే మరో 15 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తానని నందకుమార్ చెప్పారు. తెలంగాణతోపాటు ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా కూలదోసేందుకు బీజేపీ కుట్రలు పన్నింది. స్వయంగా రామచంద్ర భారతి ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఢిల్లీ ప్రభుత్వంపైనా ఆపరేషన్ జరుగుతున్నది. 43 మంది మాతో టచ్లో ఉన్నారు. వాళ్ల పదవులు ఏమీ కోల్పోరు’ అని రామచంద్ర భారతి పేర్కొన్నారు. దీనిని బట్టి బీజేపీయేతర ప్రభుత్వాలను కూలదోయడానికి ఎంత దూరమైనా వెళ్లేందుకు వెనుకాడబోరని స్పష్టం అవుతున్నది.
తప్పించుకున్న తుషార్..
బీజేపీకి, కేంద్ర ప్రభుత్వంలోని ‘ఇద్దరు పెద్దల’కు అత్యంత సన్నిహితుడైన తుషార్ తృటిలో తెలంగాణ పోలీసుల నుంచి తప్పించుకొన్నారు. వాస్తవానికి 26వ తేదీన ఫామ్హౌస్లో ఎమ్మెల్యేలతో చర్చలకు తుషార్ రావాల్సి ఉన్నది. తుషార్ వస్తారా? అని సింహయాజీ అడగగా.. ‘హా.. వస్తాడు తుషార్. అతడు నంబర్ 1, నంబర్ 2కు చాలా దగ్గరి వ్యక్తి. అతన్ని నేను ఎకడికైనా తీసుకురాగలను. నాకు చాలా క్లోజ్’ అని రామచంద్ర భారతి చెప్పారు. ‘స్వామిజీ.. మీరు తుషార్ వస్తానంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిపి మొత్తం 10 మందిని కలిపించే ఏర్పాట్లు చేస్తా’ అని సింహయాజీ ఆఫర్ ఇచ్చారు. ‘అయితే మేము కలిసే వస్తాం. ముందుగా నేను 26న ఉదయం వచ్చి వారిని కలుస్తా. వారు రెడీగా ఉంటే సాయంత్రం తుషార్ను హైదరాబాద్ రప్పించే ప్లాన్ చేస్తా. తుషార్ హైదరాబాద్ మాత్రమే వస్తాడు’ అని రామచంద్ర భారతి స్పష్టంచేశారు. తుషార్ ఎప్పుడూ ఖాళీగా ఉండడని, ప్రత్యేక విమానాల్లో తిరుగుతూనే ఉంటాడని, ఒకే పనిమీద ఎక్కువ సమయం వెచ్చించడని చెప్పుకున్నారు. దీన్ని బట్టి బీజేపీకి సంబంధించిన అన్ని కొనుగోళ్లను తుషార్ కూడా పర్యవేక్షిస్తున్నట్టు స్పష్టం అవుతున్నది. అయితే.. చివరి నిమిషంలో హైదరాబాద్కు రాకపోవడంతో తప్పించుకున్నట్టు అర్థమవుతున్నది.
ఫ్లైట్లో ఢిల్లీకి.. వై ప్లస్ భద్రత..
ఢిల్లీ ప్రతినిధులు 26న హైదరాబాద్ వచ్చి.. ఎమ్మెల్యేలతో చర్చలు జరుపాలని నిర్ణయించుకున్నారు. అందరూ చేరడానికి సిద్ధమైతే 27న ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించి బీఎల్ సంతోష్, అమిత్ షాను కలిపిస్తామని రామచంద్ర భారతి చెప్పారు. అంతేకాదు.. ఏపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఇచ్చినట్టే.. పార్టీలో చేరేవారికి వై ప్లస్ క్యాటగిరీ సెక్యూరిటీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ డీల్లో ముఖ్య పాత్ర పోషించిన నందకుమార్కు ఏదో ఒక పోస్ట్ ఇస్తామని చెప్పారు. ఆయన సెక్యూరిటీ బాధ్యత సైతం కేంద్రమే చూసుకుంటుందన్నారు. వీటన్నింటిని బట్టి బీజేపీ కొనుగోళ్ల వ్యవహారం నలుగురితో పోదని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చి తెలంగాణను ఆక్రమించాలన్న దురాశతోనే ఇదంతా చేస్తున్నదని స్పష్టం అవుతున్నది.
రాష్ట్ర నేతలకు అంత సీన్ లేదు..
బీజేపీ రాష్ట్ర నేతలకు కొనుగోళ్ల వ్యవహారం తెలియకుండా బీజేపీ పెద్దలు జాగ్రత్త పడ్డారు. ‘సంతోష్ చిన్న వ్యక్తి కాదు. కేంద్ర మంత్రులు ఆయనను కలవాలన్నా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరెవరు వస్తున్నారో చెప్తేనే ఆయనతో మాట్లాడగలం. ఒక్కసారి కూర్చుంటే పని కావాల్సిందే. కమిట్ అయినవాళ్లు రావాల్సిందే’ అని రామచంద్ర భారతి చెప్పారు. ఢిల్లీ కేంద్రంగా ఈ తతంగం నడుపుతున్నట్టు రాష్ట్ర నేతలకు తెలియనీయొద్దని నందు కోరారు. దీనికి రామచంద్ర భారతి స్పందిస్తూ.. బండి సంజయ్, కిషన్రెడ్డి చేతుల్లో ఏమీ లేదని స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో తెలియొద్దని అనుకున్నాం. అందుకే రాష్ట్ర నేతలకు సంబంధం లేకుండా బైపాస్ చేసి కేంద్రమే నేరుగా డీల్ చేస్తున్నది’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలను ఆకర్షించేందుకు దాసోజు శ్రవణ్ను వాడుకోవాలని రామచంద్ర భారతి సూచించారు. ‘దాసోజు శ్రవణ్ మరో ఇద్దరు పెద్ద నేతలు స్వామిగౌడ్, బూడిద భిక్షమయ్యగౌడ్తో కలిసి పార్టీకి రాజీనామా చేశారు స్వామీజీ’ అని నందూ వివరించారు. దీంతో రామచంద్ర భారతి ఆశ్చర్యపోయారు. రాష్ట్ర బీజేపీ పరిస్థితి సరిగా లేదని, వాళ్లకు మీరైనా చెప్పండి అని నందూ కోరాడు. దీనిని బట్టి రాష్ట్ర బీజేపీ నేతలపై కేంద్ర పెద్దలకు ఏమాత్రం నమ్మకం లేదని అర్థం అవుతున్నది.