Vote | హైదరాబాద్, ఏప్రిల్ 11 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత భవిష్యత్తును నిర్ణయించేది ఓటు. అయితే, స్వాతంత్య్రం వచ్చి 77 ఏండ్లయినా ఏ సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇప్పటికీ నూరు శాతం పోలింగ్ రికార్డవ్వలేదు. అయితే, ఓటు విలువను భవిష్యత్తు తరాలకు చాటి చెప్తున్నారు కర్ణాటకకు చెందిన 81 ఏండ్ల వృద్ధురాలు చిన్నమ్మ.
చామరాజనగర్ జిల్లాలోని చిక్కాటి గ్రామానికి చెందిన ఈమె.. ఇప్పటివరకూ 41సార్లు ఓటు హక్కును వినియోగించుకొన్నారు. గ్రామ, జిల్లా పంచాయతీ, అసెంబ్లీ, లోక్సభ ఇలా జరిగిన ప్రతీ ఎన్నికలోనూ ఆమె ఓటింగ్లో పాల్గొనేవారు. ఆరోగ్యం బాగోలేని సందర్భాల్లో కుటుంబసభ్యుల సాయంతో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకొన్నట్టు చెప్పిన చిన్నమ్మ.. ఓటేయడం యువత బాధ్యత అంటూ పేర్కొన్నారు.