శంకరపట్నం, ఏప్రిల్ 14: తల్లిదండ్రులను కోల్పోయిన అభాగ్యులకు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అండగా నిలిచారు. గూడు నిర్మించి భరోసానిచ్చారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేటకు చెందిన బొజ్జ అరుణ – సమ్మయ్య దంపతులు. సమ్మయ్యకు తల్లి నర్సమ్మతోపాటు ఇద్దరు కూతుళ్లు మౌనిక, మానస, కొడుకు సాయి ఉన్నారు. సమ్మయ్య కూలీగా, అరుణ డప్పు కళాకారిణిగా కుటుంబాన్ని పోషించుకొనేవారు. ఐదేండ్ల క్రితం సమ్మయ్య అనారోగ్యంతో మరణించాడు. అరుణ కాయకష్టం చేసి పెద్దబిడ్డ మౌనిక పెండ్లి చేసింది. ఏడాది క్రితం అరుణ సైతం అనారోగ్యంతో కన్నుమూసింది. పిల్లలతోపాటు సమ్మయ్య తల్లి అనాథలయ్యారు.
ఏడాది క్రితం గ్రామపర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే రసమయి వీరి దీనగాథను తెలుసుకొని చలించిపోయారు. పిల్లల బాగోగులను చూసుకుంటానని, చదువుకు సాయం చేస్తానని, ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ వెంటనే ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.2.50 లక్షలు వెచ్చించి ఇల్లు కట్టించారు. గురువారం అంబేద్కర్ జయంతి సందర్భంగా వారితో గృహప్రవేశం చేయించారు. తల్లిందండ్రులను కోల్పోయిన తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యే రసమయికి ఆ పిల్లలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.