మంచిర్యాల, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా మందమర్రిలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకున్నది. మందమర్రిలోని కూరగాయల మార్కెట్లో బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం చేస్తూ ఆడెపు మల్లమ్మ అనే 65 ఏండ్ల వృద్ధురాలిని పలుకరించారు. పింఛన్ ఇయ్యక ఎన్ని నెలలైతంది మల్లమ్మా.. అని అడగ్గా.. మూడు నెలలైంది బాంచెన్ అని సమాధానం చెప్పింది. ‘గదే కేసీఆర్ సార్ రూ. 2 వేల పింఛన్ ఎమర్జెన్స్గా ఇచ్చిండు. మాలాంటి బీదోళ్లను కాపాడిండు. నిజం చెప్తున్నా.. గీ రేవంత్రెడ్డి మోసం చేసిండయ్యా. కాంగ్రెసోళ్లను పింఛన్ కోసం అడిగితే నిన్నెవ్వడు ఎయ్యమన్నడు ఓటు.. నాలుగు వేలిస్త అని గ్యారంటీ రాసిచ్చిండా?
అంటున్నరు’ అని మల్లమ్మ వాపోయింది. మరి ఇప్పుడు ఏం చేసుడు అని కొప్పుల ఈశ్వర్ అడగ్గా.. ఇగ ఏం చేస్తం.. గాయనకు ఇగ ఓటు వేయం అని చెప్పింది. ‘మీరు మా ముసలోళ్లు, మూడుగోల్లను చూడున్రి. మాకు మందులకు మాకులకు అక్కర్రావాలే బాంచన్. నిన్ను ఎక్కడనో చూసినట్టుందయ్యా’ అంటూ మాట్లాడుకొచ్చింది. దానికి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ‘నేను ధర్మపురికి నాలుగుసార్లు ఎమ్మెల్యే, గోదావరిఖనికి రెండుసార్లు ఎమ్మెల్యే, మంత్రిగా కూడా చేసిన’ అని ఆయన చెప్పగానే.. అవునా ధర్మపురిల చూసిన కావచ్చు అంటూ సంబురపడింది. ఇందంతా జరుగుతున్నప్పుడు మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సైతం పక్కనే ఉన్నారు.