Bhadrachalam | తెలంగాణ గురుకుల విద్యార్థులు.. దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు పొందుతున్నారు. కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని కూడా పాట్నా ఐఐటీలో సీటు పొందారు. ఆ ఆదివాసీ బిడ్డను అధికారులు అభినందించి, ఐప్యాడ్ను అందజేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల పరిధిలోని కటాయగూడ్ గ్రామానికి చెందిన కన్నయ్య, శాంతమ్మ దంపతులకు కోర్స లక్ష్మి అనే కూతురు ఉంది. లక్ష్మి పేరెంట్స్ ఇద్దరు కూడా నిరక్ష్యరాసులు. ఇక లక్ష్మికి మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఏడో తరగతిలోనే గురుకుల విద్యాసంస్థలో చేర్పించారు. 7 నుంచి ఇంటర్మీడియట్ వరకు భద్రాచలం గవర్నమెంట్ ట్రైబల్ గర్ల్స్ గురుకులంలో చదివారు. 10వ తరగతిలో 10 జీపీఏ సాధించారు. ఇంటర్మీడియట్ ఎంపీలో 992 మార్కులు సాధించి, అందరిచేత ప్రశంసలు పొందారు. ఇంటర్ సీవోఈ కాలేజీలో చదవడంతో.. ఆమెకు మొదట్నుంచే జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ కోచింగ్ అందించారు. ఇక జేఈఈ అడ్వాన్స్డ్లో 1371 ర్యాంకు సాధించారు. ఐఐటీ పాట్నాలో ఈఈఈ బ్రాంచిలో సీటు పొందారు. దీంతో స్థానిక అమ్మాయిలకు లక్ష్మి ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ ప్రతీక్ జైన్, గిరిజన గురుకులాల ఆర్సీవో డేవిడ్ రాజు లక్ష్మిని అభినందించారు. రూ. 80 వేల విలువ చేసే ఐప్యాడ్తో పాటు సెల్ఫోన్ను అందజేశారు. ఈఈఈ కోర్సు ప్రవేశానికి కావాల్సిన అడ్మిషన్ ఫీజు రూ. 74,531లను భద్రాచలం ఐటీడీఏ అధికారులు సమకూర్చారు.