ఉప్పల్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు స్కీం ఆటో డ్రైవర్లపాలిట శాపంగా మారింది. గిరాకీలేక.. బతుకుదారి కనిపించక ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో వారి కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. ఆటో సరిగా నడవకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం రాత్రి నాచారం పోలీస్స్టేషన్ పరిధిలోని దుర్గానగర్ బాబానగర్ ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకెళితే, బాబానగర్ ప్రాంతంలో నిమ్మగళ్ల నరేశ్ (23) కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.
కొన్నేండ్లుగా ఆటో నడుపుతూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. కాగా, రెండు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకాశం కల్పించడంతో ఆటోకు గిరాకీ తగ్గిపోయింది. నరేశ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. కొద్దిరోజులుగా మనస్థాపం చెందుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆటో నడిపి బుధవారం రాత్రి ఇంటికి వచ్చిన నరేశ్ ఓ గదిలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని దవాఖానకు తరలించేలోపే కన్నుమూశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.