కల్లూరు, ఫిబ్రవరి 23 : కూలీలతో వెళ్తున్న ఆటో(Aauto overturned) అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో పది మంది కూలీలకు( laborers) తీవ్ర గాయాలుకాగా.. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఖమ్మం(Khammam )జిల్లా కల్లూరు మండలం పెద్దకోరుకొండి రైతు వేదిక సమీపంలో శుక్రవారం చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామానికి చెందిన 10 మంది కూలీలు ఆటో కిరాయికి మాట్లాడుకుని కల్లూరు మండలంలోని ఓ గ్రామంలో మిరప పంటను ఏరేందుకు వెళ్తున్నారు.
ఈ క్రమంలో పెద్దకోరుకొండి సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయి ఆటో ప్రమాదవశాత్తు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పది మంది కూలీలకు తీవ్ర గాయాలు కాగా.. వీరిలో మల్లారపు భద్రమ్మ, చీమకుర్తి కృష్ణమ్మ, బండి పద్మల పరిస్థితి విషమంగా ఉన్నది.
ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్ఐ షాకీర్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్లో కల్లూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం హాస్పిటల్ రెఫర్ చేశారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న ఎస్ఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.