పరిగి టౌన్, జూన్ 11 : వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్ సమీపంలో ఆదివారం దారుణం చోటుచేసుకున్నది. ఓ యువతిని దుండగులు తీవ్రంగా గాయపరిచి, కండ్లు పొడిచి హత్య చేశారు. ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జుట్టు శిరీష (19) వికారాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో నర్సుగా పనిచేస్తున్నది. శనివారం రాత్రి ఇంట్లో వంట విషయంలో బావ అనిల్ శిరీషను మందలించడంతో మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగిరాలేదు.
ఆదివారం గ్రామ సమీపంలోని గోనె మైసమ్మ ఆలయం దగ్గర ఉన్న నీటి కుంటలో శవమై తేలింది. ఒంటిపై తీవ్ర గాయాలతోపాటు కండ్లను పొడిచినట్టు ఆనవాళ్లు ఉండటంతో హత్యకు గురైనట్టు పోలీసులు భావిస్తున్నారు. తన సోదరిని ఎవరో కొట్టి చంపారని శిరీష అన్న శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా డీఎస్పీ కరుణసాగర్రెడ్డి, సీఐ వెంకట్రామయ్య, ఎస్సై విఠల్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. యువతి మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు.