హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులులు, ఇతర వన్యప్రాణుల మరణాలు పెరుగుతుండటంతో ఆందోళన చెందిన తెలంగాణ అటవీశాఖ.. ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్లలో దాదాపు 1400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని పరిరక్షణ రిజర్వ్గా ప్రకటించాలని భావిస్తున్నది. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించిన అటవీశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టు తెలుస్తున్నది. అటవీశాఖ ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే రాష్ట్రంలో ఇదే మొదటి పరిరక్షణ రిజర్వ్ అవుతుంది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో దాదాపు 30 నుంచి 40 వరకు పరిరక్షణ రిజర్వ్లు ఉన్నాయి. వేటగాళ్లపై చట్టబద్ధంగా కఠిన చర్యలను ప్రారంభించడంతో పాటు, రిజర్వ్ ప్రాంతంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించడాన్ని నిరోధించడం, కఠినమైన నిఘాను పెంచడం పరిరక్షణ రిజర్వ్ను ప్రకటించడం వెనుక ప్రధాన లక్ష్యం. వన్యప్రాణుల రక్షణ చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను కూడా పెద్ద ఎత్తున రాబట్టవచ్చు.