గంభీరావుపేట, డిసెంబర్ 5: రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు ఓడిపోవడంతో కేసీఆర్ అమలు చేసిన పథకాలు మళ్లీ తమ లాంటి పేదోళ్లకు అందుతాయో? లేదో? అని బీఆర్ఎస్ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేటకు చెందిన ఆవునూరి దేవయ్య (50), ఆయన ముగ్గురు కొడుకులు బీఆర్ఎస్ కార్యకర్తలు. పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా చురుకుగా పాల్గొంటున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటింటా ప్రచారం చేశారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అప్పటి నుంచి దేవయ్య దిగులు చెందాడు.
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకపోవడంతో తాను రైతుబంధు పొందుతున్నాని, మంజూరైన డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించుకుంటున్నానని, మళ్లీ ఈ పథకాలు అమలు చేస్తారో లేదోనని ఆందోళన చెందాడు. ఇదే విషయమై రెండు రోజులుగా ఇరుగు పొరుగు వారితో ముచ్చటించాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఆలోచిస్తుండగానే గుండెనొప్పి వచ్చి దేవయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దవాఖానకు తరలించే క్రమంలోనే చనిపోయాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్ సిరిగిరి లక్ష్మి, ఏఎంసీ చైర్మన్ కొత్తింటి హన్మంతరెడ్డి, ఉపసర్పంచ్ అరుట్ల అంజిరెడ్డి, గ్రామాధ్యక్షుడు కొలనూరి వేణు, ఎంపీటీసీ సభ్యురాలు మూడావత్ కవిత మృతుడి ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నాడని పార్టీ నాయకులు, గ్రామస్థులు దేవయ్య సేవలను గర్తుచేసుకున్నారు.