బచ్చన్నపేట, డిసెంబర్ 27: ఆడుతూ పాడుతూ ఇల్లంతా సందడిగా తిరిగేది.. తల్లిదండ్రులతో గోముగా ముచ్చట్లు పెట్టేది.. తోటి స్నేహితులతో కలిసి సరదాగా గడిపేది.. రేపటి నుంచి ఆ అల్లరి ఉండదు.. ఆ మాటలు వినిపించవు.. ఎవరి కన్ను కుట్టిందో కానీ 11 ఏండ్లకే ఆ చిన్నారికి నూరేండ్లు నిండాయి. నిండు నూరేండ్లు కొట్టుకోవాల్సిన గుండె అకస్త్తాత్తుగా ఆగిపోయింది.
ఈ విషాదకర ఘటన మంగళవారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటలో చోటుచేసుకున్నది. బచ్చన్నపేటకు చెందిన నిలిగొండ ఆంజనేయులు, లక్ష్మి దంపతుల కుమార్తె సౌమ్య (11) 6వ తరగతి చదువుతున్నది. సౌమ్య పుట్టినప్పటి నుంచి గుండెకు రంధ్రం ఉన్నదని, 15 ఏండ్లు నిండిన తరువాత ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. మంగళవారం ఉదయం తల తిరుగుతున్నదని చెప్పింది. అంతలోనే గుండె పోటుతో సౌమ్య ప్రాణాలు విడిచింది.