హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : కేంద్ర హోంమంత్రి అమిత్షా వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. నిజాంకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు పోరాటం చేశారనడం ఆయన అజ్ఞానాన్ని బయటపెట్టిందన్నారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమయ్యేందుకు పోరాటం చేసి అమరులైన 4,000 మంది త్యాగాలను, నాటి ఉద్యమాన్ని నడిపిన రావి నారాయణరెడ్డి, మఖ్ధూం మొహియొద్దీన్, బద్ధం ఎల్లారెడ్డిని అమిత్ షా ఉద్దేశపూర్వకంగానే విస్మరించారని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు. తెలంగాణ చరిత్రపై అమిత్షా చేసిన ప్రసంగం అర్ధసత్యాలతో, తప్పుడు భాష్యాలతో ఉన్నదని విమర్శించారు. తక్షణమే ఆయన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వాస్తవాలను దాచి తామేదో ఘనత సాధించినట్టు షా చెప్పడం విడ్డూరంగా ఉన్నదన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉర్దూను రద్దు చేస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు అమిత్షా సమాధానం చెప్పాలని చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు.
కేంద్రప్రభుత్వం వంట గ్యాస్పై ఇస్తున్న కొద్దిపాటి సబ్సిడీని కూడా ఎత్తేసి 21 కోట్ల వినియోగదారులపై మరింత భారాన్ని మోపిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. సబ్సిడీ ఎత్తివేత నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు.