హైదరాబాద్, మే 14 ( నమస్తే తెలంగాణ) : భారతీయ జనతా పార్టీ తుక్కుగూడ లో నిర్వహించిన అమిత్ షా బహిరంగ సభకు స్పందన కరువైంది. సభకు హాజరైన వారిలో ఉత్సాహమే కనిపించలేదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగానికి సభికుల నుంచి స్పందన బీజేపీ నాయకులను నిరాశపర్చింది. సభకు వచ్చిన వారిని బలవంతంగా ‘జోర్సే బోలో..’ అంటూ పదే పదే అమిత్ షా వేడుకోవాల్సి వచ్చింది.
తన ప్రసంగంలో చెప్పే అంశాలపై సభకు హాజరైన వారి నుంచి అసక్తి కనిపించలేదు. అడిగి మరీ చప్పట్లు కొట్టించుకోవాల్సి వచ్చింది. తన ప్రసంగంలో మొత్తం 13 సార్లు ‘జోర్సే బోలో’… ‘జోర్సే బతావ్’, ‘సమజా హైనా’ అంటూ సభికులకు అభ్యర్థించాల్సి వచ్చింది. అమిత్షా ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలన్నీ అబద్ధాలే కావడంతో సభికుల నుంచి స్పందన కరువైంది. ఇక్కడ అమలవుతున్న పథకాలపై తప్పుడు సమాచారాన్ని తెలుపుతూ ప్రసంగాన్ని అమిత్ షా కొనసాగించడంతో.. సభకు హాజరైన వారి నుంచి తగిన మద్దతు రాలేదు.