హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ)లో ఈ నెల 11న 74వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించనున్నట్టు అకాడమీ డైరెక్టర్ ఏఎస్ రాజన్ తెలిపారు.
గురువారం మీడియా సమావేశంలో రాజన్ మాట్లాడుతూ, 74వ బ్యాచ్లో 195 మంది శిక్షణ పొందారని, వీరిలో 166 మంది భారతీయులు కాగా, 29 మంది విదేశీ అధికారులు ఉన్నారని చెప్పారు. వీరిలో 37 మంది భారతీయ మహిళా ఐపీఎస్ అధికారులు ఉన్నట్టు చెప్పారు. తెలంగాణ క్యాడర్కు ఐదుగురు ఐపీఎస్లను కేటాయించినట్టు రాజన్ వివరించారు.105 వారాలపాటు మొత్తం 17 సబ్జెక్టుల్లో ఐపీఎస్లకు కఠోర శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. కొవిడ్ సంక్షోభం తర్వాత తొలిసారి ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్ను ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.