హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బీజేపీ సీనియర్ నేతలు విభేదాలను పక్కనబెట్టి పనిచేయాలని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా సూచించారు. ముఖ్యంగా నేతల మధ్య కోల్డ్వార్పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. గురువారం ఆయన కొంగరకలాన్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో పాల్గొన్నారు. అంతకుముందు నోవాటెల్ హోటల్లో బీజేపీ సీనియర్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమిత్షా మాట్లాడుతూ.. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడొద్దని, లీకులు ఇవ్వొద్దని సూచించినట్టు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలకు తగ్గట్టుగా ఎందుకు ఓట్లు, సీట్లు రాలేదని ఆరా తీసినట్టు తెలిసింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ 35% ఓటింగ్ సాధించడంతోపాటు పది లోక్సభ స్థానాలు గెలవాలని, అందుకు అనుగుణంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిచినా, నాలుగు ఎంపీ స్థానాల్లో విజయం సాధించామని, ఈసారి ఎమినిది మంది ఎమ్మెల్యేలు ఉన్నందున పదికి తగ్గకుండా ఎంపీ సీట్లు గెలవాలని అన్నారు. ‘మరోసారి మోదీ విజయం చారిత్రక అవసరం’ అనే తీర్మానాన్ని రాష్ట్రస్థాయి సమావేశంలో ఆమోదించారు. పది లోక్సభ స్థానాల్లో గెలిచేలా కృషి చేస్తామని క్యాడర్తో అమిత్షా ప్రతిజ్ఞ చేయించారు.