హైదరాబాద్, జూన్ 2(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ మరోసారి విషం కక్కింది. మనసులోని మాలిన్యాన్ని మాటల్లో బయటపెట్టుకున్నది. ఆవిర్భావ వేడుకల పేరుతో ఢిల్లీ వేదికగా మరోసారి రాష్ట్ర ఏర్పాటును అవమానించింది. తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ ప్రధాని మోదీ గతంలో పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పాటును కించపరిస్తే.. రాజకీయం కోసమే తెలంగాణ ఏర్పాటు చేశారంటూ హోంమంత్రి అమిత్షా తాజాగా అవమానించారు. ఎనిమిదేండ్లుగా ఏనాడూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గుర్తుకురాని, వేడుకలను జరుపాలన్న సోయి లేని బీజేపీ.. హఠాత్తుగా ప్రేమను కురిపిస్తూ ఢిల్లీలో గురువారం కార్యక్రమం నిర్వహించడం అందరిలోనూ అనుమానాలను రేకెత్తించింది.
తొలిసారి అధికారికంగా కేంద్రం ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి హోదాలో పాల్గొన్న బీజేపీ అగ్రనేత అమిత్షా.. రాష్ట్ర ఏర్పాటుపై మరోసారి నోరుపారేసుకున్నారు. అమరుల త్యాగాలను అవమానించేలా మాట్లాడారు. తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేసి మనుషుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టారంటూ విషపూరిత వ్యాఖ్యలు చేశారు. రాష్ర్టానికి చెందిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి, పలువురు నాయకుల ముందే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు ఎల్లప్పుడూ మద్దతిచ్చిందంటూ అమిత్షా అబద్ధాలు వల్లె వేయడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. అదే నిజమైతే, 2004కు ముందు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ర్టాన్ని బీజేపీ ఎందుకు ఏర్పాటు చేయలేదని వారు ప్రశ్నిస్తున్నారు. వాజపేయి ఆధ్వర్యంలో మూడు రాష్ర్టాలను ప్రశాంతంగా ఏర్పాటు చేసినట్లు చెప్పుకున్న అమిత్షా.. మరి అప్పుడే తెలంగాణ రాష్ర్టాన్ని ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ విముక్తికి అల్లూరి పోరాడారట..
తెలంగాణ చరిత్రపై కనీస అవగాహన లేకుండా మాట్లాడిన అమిత్షా.. తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. అల్లూరి సీతారామరాజు తెలంగాణ విముక్తి కోసం రాంజీగోండు, కొమురంభీంతో కలిసి నిజాంపై పోరాటం చేశారంటూ చరిత్రకు వక్రభాష్యం చెప్పారు. ఇంతకన్నా భావ దారిద్య్రం మరొకటి ఉంటుందా.. అంటూ తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇది తెలంగాణ చరిత్రను, అల్లూరి వీరత్వాన్ని రెండింటినీ కించపర్చడమేనని మండిపడుతున్నారు. ఎనిమిదేండ్లుగా తెలంగాణకు ఎన్నో నిధులు ఇచ్చామంటూ తుక్కుగూడ సభలో ఊదరగొట్టిన అబద్ధాలనే మళ్లీ ఢిల్లీలోనూ అమిత్షా వల్లె వేశారు. ఒకవేళ కేంద్రం చెప్పినట్టు తెలంగాణ ప్రభుత్వం విని ఉంటే రాష్ర్టానికి మరో రూ.లక్ష కోట్లు వచ్చేవంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభికులనే విస్మయపర్చాయి. తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన రూ.లక్ష కోట్ల నిధులను ఉద్దేశపూర్వకంగానే ఎగ్గొట్టిన విషయాన్ని తన వ్యాఖ్యల ద్వారా అమిత్షా అంగీకరించినట్లయ్యింది. తెలంగాణపై తామెప్పుడూ సవతితల్లి ప్రేమ చూపలేదంటూ ఆయన నమ్మబలికే ప్రయత్నం చేశారు కానీ, అవీ గురవింద మాటలేనని తేటతెల్లమైంది. సవతితల్లి ప్రేమ చూపకుంటే.. తెలంగాణకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదు? రాష్ట్రంలోని ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? ఐఐఎం, ఐఐఐటీ, నవోదయ విద్యాలయాలు ఎందుకు ఇవ్వడం లేదు..? అంటూ తెలంగాణ సమాజం నిలదీస్తున్నది. ఆవిర్భావ వేడుకల పేరిట నిర్వహించిన కార్యక్రమం జరిగిన తీరు, అమిత్షా ప్రసంగం రాజకీయ లబ్ధి కోసం ఏర్పాటు చేసిన సభను తలపించింది. అబద్ధాలకు దానిని వేదికచేసి తెలంగాణ ప్రజల కండ్లకు గంతలు కట్టే ప్రయత్నం అడుగడుగునా కనిపించింది.