హైదరాబాద్ : ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా జిల్లాకేంద్రాల్లోనూ ఐటీ హబ్లు ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే పలు జిల్లా ఐటీ హబ్లు ప్రారంభించనున్నది. త్వరలో నిజామాబాద్లోనూ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆధ్వర్యంలో అమెరికా, ఆస్ట్రేలియాకు చెందిన ఐటీ కంపెనీల ప్రతినిధులు ఐటీ హబ్ను పరిశీలించారు.
ఈ ఐటీ హబ్లో అన్ని వసతులు కల్పించారని, ఇంకుబేషన్ సెంటర్ కూడా ఉందని తెలిపారు. నిజామాబాద్ పట్టణానికి ఐటీ పరిశ్రమ అభివృద్ధి కావాల్సిన అన్ని అనుకూలతలు ఉన్నాయని ప్రతినిధులు తెలిపారు. ఇక్కడ ఉన్న విద్యాసంస్థల ద్వారా ఐటీ పరిశ్రమలకు కావాల్సిన నాణ్యమైన మానవ వనరుల లభ్యత సాధ్యమవుతుందన్నారు. వందలాది మంది తెలుగు ఎన్నారైలు విదేశాల్లో అనేక ఐటీ కంపెనీలు పెట్టారని, వీరిలో కంపెనీల ఏర్పాటుకు ముందుకు వచ్చిన వారికి ప్రభుత్వం తరఫున, పాలసీ పరమైన రాయితీలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
అలాగే ప్రతినిధుల బృందం అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ బిగాలతో భేటీ అయ్యారు. ఐటీ హబ్తో పాటు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని గణేశ్ బిగాల పేర్కొన్నారు. ప్రతినిధుల బృందం ఐటీ హబ్ను పరిశీలించిన తర్వాత సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఐటీ హబ్ ప్రచారం కోసం గురువారం వెబ్నార్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత, మహేశ్ బిగాల, ఐటీ తెలంగాణ సీఈవో విజయ్ రంగినేని తదితరులు పాల్గొంటారని వివరించారు.