వరంగల్ : ఆపరేషన్ స్మైల్(Operation Smile) ద్వారా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్న 161 చిన్నరులకు విముక్తి కలిగించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా(Amber Kishore Jha) తెలిపారు. గత నెల జనవరి మొదటి తారీఖు నుంచి నెలాఖరు వరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కమిషనరేట్ పోలీసులు బాలల సంరక్షణ విభాగం, చైల్డ్ లైన్, కార్మిక శాఖతో కలిసి ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కమిషనరేట్ పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలు నిర్వహించారు.
ఇందులో బాల కార్మికులు, బడి మానేసిన 161 మంది బాలబాలికలను గుర్తించి వారిని బాలల సంరక్షణ గృహానికి తరలించామన్నారు. ఇందులో 137 మంది బాలలు, 24మంది బాలికలు ఉన్నారని తెలిపారు. బాలల సంరక్షణ గృహానికి తరలించిన వారిలో తెలంగాణకు చెందిన 92, ఇతర రాష్ట్రాలకు 69మంది చిన్నారులు ఉన్నట్లుగా గుర్తించామన్నారు. ఈ తనిఖీల్లో చిన్నారులచే పనులు చేయించుకుంటున్నా ఏడుగురు షాపు యజమానులపై కేసులు నమోదు చేసినట్లు వివరాలను వెల్లడించారు. అలాగే ఈ తనిఖీల్లో ఉత్తరప్రదేశ్ చెందిన బాలికను దర్పణ్ యాప్ ద్వారా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. ఈ తనిఖీలు కొనసాగుతాయని, ఎవరైనా చిన్నారులతో వెట్టి చాకిరీ చేయించుకునే యాజమానుల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.