హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్రంలో అమలుచేస్తున్న దళితబంధు పథకం విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తున్నదని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 38,323 ఎస్సీ కుటుంబాలు దళితబంధు ద్వారా లబ్ధిపొందినట్టు తెలిపారు. ఇందుకోసం రూ.3,832 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. దేశంలోనే అత్యంత ఎత్తయిన 125 అడుగుల అంబేదర్ విగ్రహాన్ని ఆయన జయంతి నాడే తెలంగాణ రాష్ట్ర సాధకుడు, సీఎం కేసీఆర్ ఆవిష్కరించడం భారతదేశ చరిత్రపుటల్లో నిలిచే రోజు అని పేర్కొన్నారు.
అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. అంబేదర్ రచించిన రాజ్యాంగంలోని అర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని వివరించారు. రాష్ట్రం సాధించడంతోపాటు చరిత్రలో నిలిచిపోయే ఈ విగ్రహం స్థాపించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దకుతుందని కొనియాడారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ఇంత గొప్ప చరిత్రాత్మక నిర్ణయం తెలంగాణకే మణిహారమని పేర్కొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాలన్న లక్ష్యంతోనే విగ్రహాన్ని అత్యంత భారీగా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇది సీఎం కేసీఆర్ చిత్తశుద్ధి, సంకల్ప బలంతోనే సాధ్యమైందని కొనియాడారు.
అంబేద్కర్ స్మృతిభవనంలో అంబేద్కర్ జీవిత విశేషాలను తెలిపే ఫొటో గ్యాలరీని వీక్షిస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్, మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఎమ్మెల్సీలు పాడి కౌశిక్రెడ్డి, తాతా మధు, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు
దళితబంధుతో పేదల జీవితాల్లో వెలుగులు
దశాబ్దాలుగా చీకటి అలుముకున్న పేద దళితుల జీవితాల్లో దళితబంధు ద్వారా సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని కొప్పుల ఈశ్వర్ అన్నారు. తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో ఏయే మా ర్పులు వచ్చాయో కండ్ల ముందు కనిపిస్తున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధిని సాధిస్తున్నదని పేర్కొన్నారు. విగ్రహ రూపకల్పనలో ఎప్పటికప్పుడు మార్పులు సూచించిన ప్రజాప్రతినిధులు, సీఎం కేసీఆర్ మార్గదర్శనం, నిరంతర పర్యవేక్షణ, త్వరితగతిన పనులు పూర్తిచేయడానికి మంత్రి ప్రశాంత్రెడ్డి చేసిన కృషి అభినందనీయని కొనియాడారు. మహత్తర కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి కృషిచేసిన సీఎస్ శాంతికుమారి, విగ్రహ రూపశిల్పి అనిల్రామ్ సుతార్, సెక్రటరీ రాహుల్ బొజ్జ, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందించారు.