భక్తి అంటే.. నామస్మరణ కాదు.. ఆచరణ
నిబద్ధత అంటే.. కపటత్వం కాదు.. కట్టుబాటు
ప్రేమ అంటే.. పెదవుల మీది మాటకాదు.. మనసు..
దళితానుబంధం అంటే ఓట్ల రాజకీయం కాదు.. కోట్ల విలువైన స్నేహం అని నిరూపించారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు. దళితుల పట్ల చిత్తశుద్ధితో కూడిన నిబద్ధతను మరోసారి చాటిచెప్పారు.
రాముడు, కృష్ణుడు.. భయము, భక్తి.. పటేల్, అటల్, మహాత్ముడు, బాబా సాహెబ్.. ఇలా ఎవరినైనా.. దేన్నైనా తమ రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుంటూ, దేశ రాజకీయ వ్యవస్థ స్థాయిని రోజు రోజుకూ దిగజారుస్తున్న బీజేపీ నేతలకు చెంప ఛెళ్లుమనిపించే లాంటి గొప్ప నిర్ణయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో నిర్మించిన నూతన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత, సామాజిక తత్వవేత్త, బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీ మొన్ననే ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ చర్చలో ఎక్కడ పాల్గొనాల్సి వస్తుందో అని బెంబేలెత్తి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ అసెంబ్లీ నుంచి గాయబ్ కాగా.. దీనిపై దళితనేతలకు సూటిగా జవాబు చెప్పకుండా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పలాయనం చిత్తగించారు. పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాల్సిందేనని సోషల్ మీడియా హోరెత్తుతుంటే.. ప్రతిక్షణం ట్విట్టర్లో విద్వేష సందేశాలిచ్చే దేశవ్యాప్త బీజేపీ నేతలు నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టు మౌనం వహించారు.
అంబేద్కర్ మాటల్లోనే చెప్పాలంటే.. మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండటం.. మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడటం రెండూ నేరమే. పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టే విషయంలో మాట మాట్లాడటానికి కూడా బీజేపీ నేతలకు నోరు రాలేదు.. రావటం లేదు..
ఐట్లెతే ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదమే మనం ఎంతకాలం ఈ విభేదాల నడుమ జీవిస్తాం. ఎంతకాలం సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని తిరస్కరిస్తాం? ఇలా కొనసాగినంతకాలం దేశంలో రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో ఉన్నట్టే. సమాజంలో ఈ విభేదాలను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం తొలిగించాల్సిందే. లేకపోతే ఈ అసమానత్వం అనేది రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చివేస్తుంది.
– డా.బీఆర్ అంబేద్కర్
దళితులపై తన ప్రేమ మాటలు కాదని, చేతలని నిరూపించారు. తెలంగాణ నూతన సచివాలయ భవనానికి బాబాసాహెబ్ పేరు పెట్టి తన చిత్తశుద్ధిని, ప్రేమను కనబరిచారు.
సిద్దిపేటలో ఎమ్మెల్యేగా మొదలుకొని.. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి దాకా దళితచైతన్యమే జీవధారగా రాజకీయ ప్రస్థానం సాగిస్తున్న సీఎం కేసీఆర్… తెలంగాణ రాష్ట్రం భవ్యంగా, దివ్యంగా, మహోన్నతంగా సాగర తీరాన నిర్మిస్తున్న అత్యద్భుత సుందర పరిపాలనాసౌధం సచివాలయానికి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థకు రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహోన్నతుడి పేరును పెట్టి.. తన బహుజనాసక్తిని.. దళితానురక్తిని మరోసారి నిరూపించుకున్నారు.
కేసీఆర్ సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే నేటి దళితబంధుకు మూలంగా భావించే దళిత చైతన్య జ్యోతి కార్యక్రమాన్ని అమలుచేసిన నాయకుడు. అధికారంలోకి వచ్చిన్నాటి నుంచి స్థానిక సంస్థలు మొదలు ఉన్నత రాజ్యాంగ వ్యవస్థల దాకా అనేక పదవులను దళితులకు అందించారు. ప్రత్యేకంగా స్టడీ సెంటర్లను ఏర్పాటుచేశారు. హుస్సేన్సాగర్ తీరంలో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. సమాజంలో అట్టడుగున ఆర్థికంగా, హార్థికంగా వివక్షకు గురైన దళిత సమాజోద్ధరణకు దేశంలో మునుపెన్నడూ ఏ ప్రధానమంత్రీ.. ఏ ముఖ్యమంత్రీ ఆలోచించని విధంగా యోచించి.. వారి ఉన్నతిని స్వప్నించి.. దాన్ని సాకారం చేసుకొనేందుకు దళితబంధు అన్న గొప్ప పథకాన్ని తీసుకొని వచ్చిన దేశంలోనే ఒకే ఒక్క నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ అన్ని నిర్ణయాలకు ఆకాశమే హద్దుగా తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరును నిర్ణయించి చరిత్ర సృష్టించారు.
నమస్తే తెలంగాణ,నెట్వర్క్: తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు అంబరాన్ని తాకాయి. దాదాపు అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు.. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి తమ కృతజ్ఞత చాటుకున్నారు. పలు చోట్ల పటాకులు కాల్చి తమ ఆనందం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి సీఎం కేసీఆర్ కటౌట్కు క్షీరాభిషేకం చేశారు. ఆయనతో పాటు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, శానంపూడి సైదిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డి అంబేద్కర్ విగ్రహం, కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. నిర్మల్లోని క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి ఇంద్రకరణ్రెడ్డి క్షీరాభిషేకం చేశారు. మహబూబ్నగర్లో టీఆర్ఎస్ నేతలు, దళిత సంఘాల నేతలతో కలిసి అంబేద్కర్ విగ్రహం, సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ క్షీరాభిషేకం చేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం జరిపారు. నకిరేకల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని అంబేద్కర్ సర్కిల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య..అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. హనుమకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, కుడా చైర్మన్ సుందర్రాజ్, హసన్పర్తిలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అంబేద్కర్ విగ్రహం, సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకించారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించడంపై ప్రభుత ్వ విప్ గువ్వల బాలరాజు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని పలు నియోజకవర్గాల్లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఎమ్మెల్సీ వాణీదేవీ, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, జి.సాయన్న, మేయర్ విజయలక్ష్మి తదితరులు కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. రాజన్నసిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ శంకరయ్య, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కే చంద్రశేఖర్రావు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన కీలక భవనానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం సముచితమని భావిస్తాను. ఇది
ఉత్తమమైన నిర్ణయం.
– బీఆర్ అంబేద్కర్ మనుమడు
జై భీమ్.. జై తెలంగాణ అంటూ నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీయం. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం చరిత్రాత్మకం. పార్లమెంట్కు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించింది. దీన్ని కేంద్రం స్వీకరించి వెంటనే మహనీయుడి పేరు పెట్టాలి.
– మంత్రి కే తారకరామారావు
నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ప్రతినిత్యం అంబేద్కర్ ఆశయ స్ఫూర్తి ప్రజ్వరిల్లాలనే దూరదృష్టితో ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప నిర్ణయాన్ని ప్రకటించారు. తెలంగాణ సమాజమంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటుంది.
-గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనమండలి చైర్మన్
నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం. రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారు. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. సమాజమంతా సీఎం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నది. రాజకీయాల్లో సాహసం చేయ డం కొందరికే చెల్లుతుంది. ఆ మహనీయుడి పేరుపై సచివాలయం ఉండడం మనందరి అదృష్టం.
– పోచారం శ్రీనివాస్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్
రాష్ట్ర పరిపాలన సౌధానికి అంబేదర్ పేరు పెట్టడం జాతికి గర్వకారణం. అన్నిరంగాల్లో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచినట్టే జాతి నిర్మాతలను గౌరవించటంలోనూ స్ఫూర్తిగా నిలిచాం. సీఎం కేసీఆర్కు అంబేద్కర్ పట్ల ఉన్న గౌరవానికి ఈ నిర్ణయమే నిదర్శం. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలి. రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
-నామా నాగేశ్వర్రావు, టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత
ప్రజాస్వామ్య ఔన్నత్యానికి ప్రతీకైన అంబేద్కర్ పట్ల సీఎం కేసీఆర్ గొప్ప గౌరవం చాటారు. అంబేద్కర్ పేరును సచివాలయానికి పెట్టడం గర్వకారణం. దార్శనిక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. ప్రపంచ మేధావుల్లో బాబాసాహెబ్ ఒకరు. తెలంగాణను స్ఫూర్తిగా తీసుకొని కేంద్రం కూడా వెంటనే నిర్ణయాన్ని వెల్లడించి అమలు చేయాలి.
– అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, అటవీశాఖ మంత్రి
రాష్ట్ర ప్రభుత్వానికి అంబేదర్ మీదున్న అపార గౌరవానికి ఈ చారిత్రక నిర్ణయమే నిదర్శనం. సీఎం కేసీఆర్ను స్ఫూర్తిగా తీసుకొని కేంద్రం కూడా నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. అసెంబ్లీ పంపించిన తీర్మానాన్ని కేంద్రం వెంటనే స్వీకరించాలి.
– వేముల ప్రశాంత్రెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి
సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి దళిత పక్షపాతి సీఎం కేసీఆర్ అన్న పేరును సార్ధకం చేశారు. సీఎం కేసీఆరే అసలైన దళితుల పక్షపాతి. దళితబంధు పథకం ప్రవేశపెట్టడం వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నాయి. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు సీఎం కేసీఆర్కు దళితులంతా జేజేలు పలుకుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆచరించాలి.
-కొప్పుల ఈశ్వర్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి
సమాజంలో ప్రతి ఒకరిని సమాన దృష్టితో చూసిన, దళిత, వెనుకబడిన వర్గాల సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు అంబేద్కర్. సచివాలయానికి ఆయన పేరు పెట్టడం యావత్ జాతికి గర్వకారణం. అసాధారణ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. దళిత, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం మరింత పెరిగింది.
-గంగుల కమలాకర్, బీసీ సంక్షేమశాఖ మంత్రి
తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెడుతున్నట్టు వచ్చిన వార్తలు న్యూస్లో చూశాను. ఇది చాలా శుభపరిణామం. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. నేను నవ్సర్జన్ ట్రస్ట్ పేరిట గుజరాత్లో దళితుల హక్కుల కోసం 40 ఏండ్లుగా పోరాడుతున్నాను. తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం ఎంతో సంతోషాన్నిచ్చింది.
– నవ్సర్జన్ ట్రస్ట్, గుజరాత్
సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేదర్ పేరు పెట్టాలనే నిర్ణయం చరిత్రాత్మక మైనది. సీఎం కేసీఆర్కు సీపీఐ తరఫున ప్రత్యేక అభినందనలు. అణగారిన వర్గాలను అన్ని రంగాల్లో భాగస్వామ్యం చేసే విధంగా రాజ్యాంగ రచన చేసిన అంబేదర్ పేరును తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి పెట్టాలని భావించడం సముచిత నిర్ణయం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాకారం చేసిన ఆర్టికల్ 3ను పొందుపరిచిన ఆయన దూర దృష్టికి సరైన నివాళి. దానికి సీపీఐ సంపూర్ణ మద్దతునిస్తుంది. నూతన పార్లమెంటు భవనానికి కూడా డాక్టర్ అంబేదర్ పేరును పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి