అంబేద్కర్కు తెలంగాణ నిజమైన నివాళి
2వేల మంది లబ్ధిదార్లకు యూనిట్ల పంపిణీ
రాష్ట్రంలో ఘనంగా అంబేద్కర్ జయంతి
దళితబంధుతో పేదల జీవితాల్లో వెలుగులు
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 14: సామాజిక సంస్కరణవాది.. ప్రజల మధ్య అంతరాలను చెరిపేసేందుకు ఆమరణాంతం కృషిచేసిన మహనీయుడు.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ సమాజం నిజమైన నివాళిని అర్పించింది. ఎంతకాలం జీవించామన్నది కాదు.. ఎంత గొప్పగా జీవించామన్నది లక్ష్యం కావాలన్న అంబేద్కర్ ఆశయాలను సాకారం చేసేలా.. సీఎం కేసీఆర్ రూపొందించిన దళితబంధు అమలు కార్యక్రమం గురువారం రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరిగింది. వివిధ జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని.. సుమారు 2వే మందికి యూనిట్లను పంపిణీచేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్, సిద్దిపేట జిల్లా దుబ్బాక, సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు లబ్ధిదారులకు యూనిట్లు అందజేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి.. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ప్రొసిడింగ్ పత్రాలను, కొంతమందికి యూనిట్లను అందజేశారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో లబ్ధిదారులకు యూనిట్లను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అందజేశారు. పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్.. హుజూరాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు వాహనాలను, ప్రొసీడింగ్ పత్రాలను మంత్రి నిరంజన్రెడ్డి అందజేశారు. మహబూబ్నగర్ అంబేద్కర్ చౌరస్తాలో లబ్ధిదారులకు 11 ట్రాక్టర్లు, 2 గూడ్స్ వాహనాలను మంత్రి శ్రీనివాస్గౌడ్ అందజేశారు. నిర్మల్ పట్టణంలో యూనిట్లను మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పంపిణీచేశారు. మంచిర్యాలలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పంపిణీ చేశారు. వరంగల్ గిరిజన సంక్షేమ భవన్లో వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, హుజూరాబాద్ (కమలాపుర్), పరకాల నియోజకవర్గం పరిధిలోని లబ్ధిదారులకు యూనిట్లను నియోజకవర్గాలవారీగా ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి అందజేశారు. తమ యూనిట్లను దళితులు కుటుంబాలతో వచ్చి.. పండుగ వాతావరణంలో అందుకొని సంబురపడ్డారు.
దళితులు ఆర్థికంగా ఎదగాలి
దళితుల తలరాత మార్చేందుకు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా మారింది. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూపిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది ప్రభుత్వ దవాఖానల్లో శానిటేషన్, డైట్, మెడిసిన్స్, వైన్స్, ఫర్టిలైజర్స్ దుకాణాల్లో దళితులకు రిజర్వేషన్ కల్పించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పక్క రాష్ర్టాల్లోని బీజేపీ, కాంగ్రెస్, ఇతర ప్రభుత్వాలు చేయలేని మహాద్భుత కార్యక్రమమిది. దళితబంధు లబ్ధిదారులు ఆర్థికంగా ఎదుగాలి. దళితబంధు పథకం దేశానికే మోడల్గా మారింది. దీనిపై కొందరు దుష్ప్రచారం చేశారు. దుబ్బాకలో ఇప్పుడు ఎన్నికలు లేవు..అయినా దళితబంధు పథకంలో వంద మందికి ప్రయోజనం చేకూరలేదా? కేంద్రం నుంచి వివిధ పద్దుల కింద తెలంగాణకు రావాల్సిన రూ.3,500 వేల కోట్లు స్థానిక దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు తెప్పించాలి.
– టీ హరీశ్రావు, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి
ఆర్థికంగా బాగుపడే వరకు దళితబంధు
రాజ్యాంగం ద్వారా ఎన్నో రిజర్వేషన్లు, హక్కులను అంబేద్కర్ కల్పించారు. వాటివల్లే బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎన్నో సౌకర్యాలు పొందుతున్నారు. ఆర్థికంగా ఎదిగేందుకు కచ్చితంగా చదువు ఉపయోగపడుతుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా వైన్షాపుల్లోఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాం. దళితబంధు పథకాన్ని దళితులు ఆర్థికంగా బాగుపడే వరకు అమలు చేస్తాం. దళితుల సమస్యలపై కలెక్టర్, ఎస్పీ వెంటనే స్పందించాలి. దళితబంధు రెండో విడతలో 2 వేల మంది జాబితాను వెంటనే తయారుచేయాలి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోనూ 70% దళితులకు ఇస్తున్నాం.
– శ్రీనివాస్గౌడ్, ఎక్సైజ్శాఖ మంత్రి
దళితుల అభ్యున్నతే ధ్యేయం
దళితుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో దళిత జాతి ఆర్థిక ప్రగతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దళితబంధు అనే విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దళితుల్లో అన్ని క్యాటగిరీల వారికి సంక్షేమ ఫలాలు అందేలా రూపొందించిన కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. 2022-23 వార్షిక బడ్జెట్లో దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించారు.
–అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి
దళితుల బతుకుల్లో వెలుగులు
దళితుల బతుకుల్లో వెలుగులు నింపి అంబేద్కర్ కన్న కలలను నిజం చేయాలని చూస్తున్న సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు. దేశంలో ఎందరో ప్రధానులు, ముఖ్యమంత్రులు వచ్చి వెళ్లారు.. కానీ సీఎం కేసీఆర్లాగా దళితుల కోసం ఒక్కరు కూడా ఆలోచించ లేదు. కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. అంబేద్కర్ ఆలోచనా విధానం ప్రకారం విద్యతోనే సామాజిక, ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చని నమ్మిన సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. – గంగుల కమలాకర్, బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి
ఎవరి హక్కు వారికే దక్కాలి
ఎవరి హక్కు.. ఎవరి వాటా వారికి దక్కాలన్నది అంబేద్కర్ అభిలాష. దళితుల అభివృద్ధి లక్ష్యంగా దళితబంధు తీసుకొచ్చాం. ఈ పథకంతో లబ్ధిపొందిన వారందరూ లబ్ధిదార్లు కాదు. వారంతా హక్కుదార్లు. దళితబంధు ద్వారా బాగుపడుతున్నవారిని చూసి ఒక మంత్రిగా సంతోషపడుతున్నా. రాబోయే 3, 4 ఏండ్లలో రాష్ట్రంలోని అన్ని దళిత కుటుంబాలకు వర్తింపజేస్తం. ఈ పథకం అమలు మీద అపోహలు సృష్టించడం సరికాదు. దేశంలోనే ఆర్థికంగా ఎదుగుతున్న రాష్ట్రం తెలంగాణ.
– ఎస్ నిరంజన్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
ఇలాంటి పథకం దేశంలోనే లేదు
దేశ చరిత్రలోనే దళతబంధులాంటి పథకం లేదు. ఈ పథకం ద్వారా అందించే రూ.10 లక్షల్లో ఒక్క రూపాయి బాకీ కాదు. ఒక్క రూపాయి కూడా వడ్డీ లేదు. కిస్తు కట్టేదీ లేదు. దళితులు తమ కాళ్లమీద తాము నిలబడాలి. ఎలాంటి అప్పుల బాధలు ఉండకూడదని తీసుకొచ్చిందే ఈ పథకం. దళిత కుటుంబాలు తాము అభివృద్ధి చెందుతూనే తమ పిల్లలను ఉన్నత చదువులను చదివించాలి. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుకున్న వారు డాక్టర్లు అవుతున్నారు. హైదరాబాద్లో 17 వేల పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వాటిలో 16 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఐటీలో 6.40 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. బాన్సువాడ, రుద్రూర్ మండల కేంద్రాల్లో పీబీఆర్ కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. విద్యార్థులు, నిరుద్యోగులకు ఇబ్బంది కలగకుండా ఉద్యోగాల సాధనకు లక్షల రూపాయలను వెచ్చిస్తున్నాం. –పోచారం శ్రీనివాస్రెడ్డి, స్పీకర్
ఎవరూ చేయని సాహసం సీఎంది
దేశంలో ఇప్పటివరకు ఏ సీఎం చేయని సాహసం కేసీఆర్.. దళితులకోసం చేశారు. ఏ బ్యాంక్ గ్యారెంటీ లేకుండా నేరుగా లబ్ధిదారునికి రూ.10 లక్షలు ఇచ్చే కార్యక్రమం ఎక్కడా లేదు. కేసీఆర్ ఇచ్చేది పెట్టుబడి. దాన్ని మీరు కష్టపడి ఎన్నింతలు పెంచుకుంటే అంత వృద్ధి చెందినట్లే. కష్టపడితే సాధ్యం కానిది ఏదీ ఉండదు. సమాజంలో ఉన్నతంగా ఎదగాలి, నలుగురికి అన్నం పెట్టాలనే లక్ష్యంతో పనిచేయాలి. కేసీఆర్ మీరు ఆర్థికంగా ఎదిగేందుకు రూ.10 లక్షలు ఇస్తున్నారు. దాన్ని పందింతలు పెంచుకొనేందుకు ఆర్థిక క్రమశిక్షణతో కష్టపడి పనిచేయాలి. –వేముల ప్రశాంత్రెడ్డి, ఆర్అండ్బీ మంత్రి