హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో కొత్త సమాజాన్ని నిర్మించేందుకు పునరంకితం కావాలని డీజీపీ అంజనీకుమార్(DGP Anjani kumar) పోలీసు అధికారులకు సూచించారు. అంబేద్కర్ జయంతి (Ambedkar Jayanthi) సందర్భంగా శుక్రవారం డీజీపీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా సీపీలు,ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో డీజీపీ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణ (Statue)లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఎన్నికల సీజన్(Election season) సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో శాంతి భద్రతల(Law and Order) పరిరక్షణలో మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో రాజకీయ పార్టీలు, సంస్థలు మరిన్నీ పాదయాత్రలు, బహిరంగ సభలు నిర్వహించే అవకాశమున్నందున శాంతి భద్రతల పనితీరు మరింత పర్యవేక్షణ, మెరుగ్గా ఉండాలని సూచించారు. ప్రతిసారీ ఎదురయ్యే కొత్త సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొవాలని పేర్కొన్నారు. ఫిబ్రవరి నెలలో నిర్వహించిన ఔట్రీచ్ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టిని సారించాలి..
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల(Road accidents) కారణంగా అనేక మంది మరణిస్తున్నారని, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించాలని డీజీపీ వివరించారు. సంబంధిత రోడ్లు భవనాల శాఖ అధికారులతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు ఇంజినీరింగ్ చేపట్టాలని సూచించారు. తెలంగాణలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, వీటిని అరికట్టేందుకు సైబర్ నేరాల(Cyber Crime)పై ప్రజలకు అవగాహన పెంచాలన్నారు. నగరాలు, పట్టణాలకే పరిమితమైనా సైబర్ నేరాలు గ్రామాలకు కూడా విస్తరించిందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి పోలీసు స్టేషన్లో కనీసం 10 మంది పోలీసు అధికారులు సైబర్ నేరాల్లో ప్రత్యేక శిక్షణ పొంది ఉండాలని ఆదేశించారు.
ప్రస్తుత రంజాన్ పండుగ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పోలీసుల వద్దకు వచ్చే సామాన్య ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీలు మహేశ్ భగావత్, సంజయ్ కుమార్ జైన్, విజయ్ కుమార్, శిఖా గోయల్, సందీప్ శాండిల్య, రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్, ఐజీలు కమలసన్ రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి, షానవాజ్ ఖాసీం, డీఐజీ రమేష్రెడ్డి, రెమా రాజేశ్వరి, ఎల్ఎస్ చవాన్ తదితర సీనియర్లు పోలీసు అధికారులు పాల్గొన్నారు.