హైదరాబాద్ : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వేల పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. తాజాగా అమరరాజా గ్రూప్ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో విద్యుత్ వాహనాల బ్యాటరీల తయారీ యూనిట్ను నెలకొల్పనున్నట్లు అమరరాజా గ్రూప్ ప్రకటించింది. ఈ మేరకు అమరరాజా సంస్థ, తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీ నెలకొల్పనుంది. రాష్ట్రంలో రూ. 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టడంతో పాటు 4,500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు అమరరాజా గ్రూప్ ప్రకటించింది. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, అమరరాజా గ్రూప్ డైరెక్టర్ గల్లా జయదేవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనున్న అమరరాజా గ్రూప్ సంస్థకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడులకు ముందుకొచ్చిన జయదేవ్కు ధన్యవాదాలు తెలిపారు. సుమారు రూ. 9,500 కోట్ల పెట్టుబడులు రావడం గొప్ప విషయమన్నారు. అమరరాజా కంపెనీకి అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. 37 ఏండ్లుగా అమరరాజా సేవలందిస్తోంది. పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయని కేటీఆర్ ప్రకటించారు.
పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన ప్రదేశమని గల్లా జయదేవ్ పేర్కొన్నారు. నూతన సాంకేతికతతో బ్యాటరీల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో మా సంస్థ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే 10 ఏండ్లలో తెలంగాణలో రూ. 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నామని జయదేవ్ స్పష్టం చేశారు.
Yet another historic win for Telangana
Amara Raja to setup India’s largest Lithium Ion Cell Manufacturing facility till date with an investment of ₹9,500 Cr, further reinforcing Telangana’s position as an ideal destination for EV and Advanced Cell Chemistry (ACC) Manufacturing. pic.twitter.com/z0h5BlwUyz
— KTR (@KTRTRS) December 2, 2022