తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలు బాగున్నాయి. దేశంలో అనేక రాష్ట్రాలను పరిశీలించినా, తెలంగాణనే అనుకూలమైన రాష్ట్రంగా గుర్తించాం. దేశంలో ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలను పరిశీలించాం. ఎక్కడా తెలంగాణ కంటే అనువైన ప్రాంతం లేదు. ఇక్కడి సుస్థిర పరిపాలన, మానవ వనరులు, అనువైన వాతావరణం, పరిశ్రమల ఏర్పాటును ప్రొత్సహించే ప్రభుత్వం ఉన్నదని గుర్తించి భారీ పెట్టుబడి పెడుతున్నాం.
-గల్లా జయదేవ్, అమరరాజా సీఎండీ
హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): లిథియం అయాన్ బ్యాటరీ, ఈవీ అడ్వాన్డ్స్ సెల్ కెమిస్ట్రీలో దేశంలోనే అత్యంత భారీ పెట్టుబడి తెలంగాణకు తరలివచ్చింది. మంత్రి కేటీఆర్ ఆహ్వానం, తెలంగాణలో పారిశ్రామిక అనుకూల విధానాలపై సంతృప్తి చెందిన అమరరాజా బ్యాటరీ సంస్థ రూ.9500 కోట్లతో మహబూబ్నగర్లోని దివిటిపల్లిలో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నది. శుక్రవారం హైదరాబాద్ మాదాపూర్లో ట్రైడెంట్ హోటల్లో అమరరాజా కంపెనీ లిథియం అయాన్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ,
పరిశోధన అభివృద్ధి సంస్థ ఏర్పాటుపై ఒప్పందం కుదుర్చుకున్నది. మంత్రి కేటీఆర్, అమరరాజా సంస్థ సీఎండీ గల్లా జయ్దేవ్ సమక్షంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, అమరరాజా సంస్థ ఈడీ విక్రమాదిత్య ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఉద్యోగాలు కల్పించడానికి గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అమరరాజా ముందుకురావడం హర్షించదగ్గ, అభినందించదగ్గ విషయమని అన్నారు. ఈ పరిశ్రమ ద్వారా స్థానిక యువత లబ్ధిపొందుతుందని, 4,500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
ఇప్పటికే ఐటీ, లైఫ్ సైన్సెస్ రంగంలో ముందంజలో ఉన్న రాష్ట్రం, ఈ పెట్టుబడితో ఈవీ, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్ రంగంలో దూసుకుపోతుందని అన్నారు. ఈ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అనువైన ప్రాంతంగా గుర్తింపు పొందుతున్నదని తెలిపారు. క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీలో తెలంగాణ రాష్ట్రం లక్ష్యాన్ని చేరుకొంటున్నదని చెప్పారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు విదేశాల నుంచి వస్తాయని, కానీ ఇక్కడి కంపెనీయే భారీ పెట్టుబడి పెట్టడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. తెలంగాణ అడ్వాన్డ్స్ సెల్ కెమిస్ట్రీలో ముందున్నదని పేర్కొన్నారు. ఈవీ, అడ్వాన్డ్స్ సెల్ కెమిస్ట్రీ కంపెనీ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఈవీ)లో ప్రోగ్రెసివ్ పాలసీని తీసుకొచ్చామని, దేశంలో మోస్ట్ ఎలక్ట్రిఫైడ్ మొబిలిటీ రాష్ట్రంగా తెలంగాణ మారుతుందని తెలిపారు. అమరరాజా కంపెనీ హైటెక్ మాన్యుఫాక్చరింగ్ విధానాలు సంతృప్తికరంగా ఉన్నాయని ప్రశంసించారు.
అమరరాజా ప్రపంచస్థాయి కంపెనీ
తెలంగాణలో ఏర్పాటుచేసే పరిశ్రమలకు నీరు, 24 గంటల విద్యుత్, మౌలిక సదుపాయాలతోపాటు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జీవన ప్రమాణాలు పెరిగాయని, తలసరి ఆదాయం పెరిగిందని తెలిపారు. తన ఆహ్వానం మేరకు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన అమరరాజా యాజమాన్యానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని గల్లా జయ్దేవ్ను కోరితే, సరైన రంగంలో తెలంగాణలో పెట్టుబడులు పెడుతామని చెప్పారని.. ఆ హామీని ఇప్పుడు నెరవేర్చారని కొనియాడారు. 16 గిగా వాట్ సామర్థ్యంతో పరిశ్రమ ఏర్పాటు చేయటాన్ని అభినందించారు. అమరరాజా సంస్థను ప్రపంచస్థాయి కంపెనీగా తీర్చిదిద్దడంలో యాజమాన్యం, సిబ్బంది కృషి, పట్టుదల ఉన్నాయని ప్రశంసించారు. ఉమ్మడి రాష్ట్రంలో గల్లా అరుణ కుమారి మంత్రిగా ఉన్నప్పుడు తాను ఎమ్మెల్యేగా ఉన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు.
తొలి దశ పెట్టుబడి రెండు వేల కోట్లు
అమరరాజా బ్యాటరీ సంస్థ కార్పొరేట్ కార్యాలయం హైదరాబాద్లో ఉన్నది. 37 ఏండ్ల కిందట స్థాపించిన ఈ సంస్థ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కలిగి ఉన్నది. రాష్ట్రంలో అమరరాజా తొలి దశలో రూ.2 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నది. దివిటిపల్లిలో ఈ-హబ్ను ఏర్పాటు చేయనున్నది. ఇందులో 200-225 మంది పనిచేయనున్నారు. హైదరాబాద్లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుండగా, ఇందులో 700-800 మంది పనిచేయనున్నారు. త్వరలో కంపెనీ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక్కడ తయారయ్యే బ్యాటరీలను డిమాండ్, మార్కెటింగ్ అవసరాలకు అనుగుణంగా విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్పై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ పరిశ్రమకు భారీ డిమాండ్ ఉంటుందని గుర్తించారు. బ్యాటరీ తయారీ సమయంలో పర్యావరణ సమస్యలు తలెత్తకుండా అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.
తెలంగాణనే అనుకూల రాష్ట్రం: గల్లా జయదేవ్
తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలు బాగున్నాయని, ఇక్కడికి పరిశ్రమలు తీసుకురావాలనే తపన మంత్రి కేటీఆర్లో ఎంతో ఉన్నదని అమరరాజా బ్యాటరీ సంస్థ చైర్మన్, ఎండీ గల్లా జయదేవ్ తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలన్న కేటీఆర్ ఆహ్వానంతో లిథియం అయాన్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ, పరిశోధన అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దేశంలో అనేక రాష్ట్రాలను పరిశీలించినా, తెలంగాణనే అనుకూలమైన రాష్ట్రంగా గుర్తించామని పేర్కొన్నారు. దేశంలో ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలను పరిశీలించామని, ఎక్కడా తెలంగాణ కంటే అనువైన ప్రాంతం లేదని, ఇక్కడి సుస్థిర పరిపాలన, మానవ వనరులు, అనువైన వాతావరణం, పరిశ్రమల ఏర్పాటును ప్రొత్సహించే ప్రభుత్వం ఉన్నదని గుర్తించి భారీ పెట్టుబడి పెట్టామని తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో టీఎస్ఐఐసీ పారిశ్రామిక పార్కులో సంస్థను ఏర్పాటుచేస్తామని, మూడేండ్లలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ విధానాలు, మంత్రి కేటీఆర్ పలుమార్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరడంతో మొగ్గుచూపామని వివరించారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, అమరరాజా న్యూ ఎనర్జీ ప్రెసిడెంట్ విజయానంద్, ఈడీ విక్రమాదిత్య, తెలంగాణ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ పాల్గొన్నారు.