CM KCR | రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. శనివారం ఆయన ప్రగతిభవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం చాలా బాధాకరమే అయినప్పటికీ ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి యెడల నిరసన తెలిపేందుకు ఇది ఉత్తమమైన మార్గంగా భావించి.. నేను నా నిరసన ప్రధానమంత్రికి నిరసనను ఈ బహిరంగ లేఖ ద్వారా తెలియజేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇందుకు సంబంధించి కారణాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశానికి స్వాతంత్య్రం రావాలని పోరాటం జరిగే రోజుల్లో.. ఒకానొక సందర్భంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్కు సారథ్యం వహించే సమయం నుంచి.. దేశానికి స్వాతంత్య్రం వస్తే ఏం చేయాలి.. ఈ దేశాన్ని ఎట్లా ముందుకుపోవాలి.. దేశంలో ఏం జరగాలి? అనే చర్చలు స్వాతంత్య్రానికి రావడానికి పూర్వమే జరిగాయి. ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయ్ నౌరోజీ ఆయన కూడా దాంట్లో భాగస్వామ్యం వహించి అనేక చర్చోపచర్చలు జరిపారు. ఎందుకంటే స్వాతంత్య్రం రావడానికి పూర్వం కొంతమంది.. మనకు ఇప్పుడే స్వాతంత్య్రం అవసరం లేదు.. బ్రిటిష్ వాళ్లు రైల్వే లైన్లు వేస్తున్నరు.. డెవలప్ చేస్తున్నరు అని మాట్లాడే వాళ్లు కూడా కొందరు ఉండి.
తెలంగాణ ఏర్పడే సమయంలో కూడా కొందరు సన్నాసులు అట్లే మాట్లాడిన్రు. ఇది చరిత్రలో కనిపించేది. అట్లాంటి వాళ్లకు తెలియజెప్పడానికి స్వాతంత్య్రం అనంతర భారతవాణి ఎలా ఉండాలి అని ఆవిష్కరణలు చేయడానికి జరిగిన మేధోమథనాలు, చర్చోపచర్చలు.. వాటి పర్యావసానంగా ఏ దేశమైనా సరే.. ఏ సమాజమైనా సరే ఒక ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలే.. అది స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు అయి ఉండాలే అనే ఒక ఉద్దేశంతో ‘ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా’ అని ఒకటి ఉండాలి.. దానికి దీని కర్తవ్యాన్ని అప్పగించాలే.. ఈ ప్లానింగ్ కమిషన్ చేసే అధ్యయనాల్లో, మేధోమథనాల్లో ప్రణాళికలు రూపొందించి కేంద్రం ఎలా వ్యహరించాలి.. రాష్ట్రం ఎలా వ్యవహరించాలే అని ఒక నిర్ణయానికి వచ్చారు.
ఆ నిర్ణయాలు, ఆలోచనలు, మేధోమథనాలే వాటి యొక్క స్వరూపమే గతంలో మనకున్నటివంటి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా.. ఆ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా వార్షిక ప్రణాళికలు ఉండాలి.. ఒక ఆర్థిక సంవత్సరంలో అవలంభించాల్సిన మంచీ చెడు.. అట్లాగే పంచవర్ష ప్రణాళికలు.. ఆ పంచవర్ష ప్రణాళికలను అనుసరించి ఈ వార్షిక ప్రణాళికలు ఉండాలి.. తద్వారా ఒక 20, 30 సంవత్సరాల ఒక విజన్ కూడా కలిగి ఉండాలనే పద్ధతిలో ఆలోచనలు జరిగాయి. నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాక ఎగ్జిటెన్స్లోకి వచ్చి ఈ దేశ ప్రగతి.. దేశంలో మనం చూస్తున్న అనేక ప్రాజెక్టులు, పరిశ్రమలు, పోర్టులు, ఎయిర్పోర్టులు కావచ్చు.. జీవితబీమా సంస్థ ఎల్ఐసీ సంస్థలు, ఇండియన్ రైల్వేస్ కావొచ్చు.. ఇలా దేశంలో అనేక విషయాలు మనకు ఈ రోజు దేశంలో కనిపిస్తున్నాయ్.
ఎందరో మహానుభావాలు మెంబర్లుగా పని చేశారు. ప్లానింగ్ కమిషన్ మెంబర్ అంటేనే ఎంతో గౌవరం ఉండేది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆర్థికవేత్తలు, వివిధ రంగాల శాస్త్రవేత్తలు, నిష్ణాతులు వారి సూచనలు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో జరుగుతున్న ప్రణాళికలు, వాటి అమలు వాటి పరిణామాలు చాలా చక్కగా అన్ బయాస్డ్గా ఆలోచించి, విశ్లేషించి.. మన వాతావరణానికి, మన దేశానికి, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే వారు’ అన్నారు.